- అగ్రికల్చర్, వెటర్నరీ, ఉద్యానవన వర్సిటీ ప్రొఫెసర్ల పిటిషన్లు కొట్టేసిన కోర్టు
- యూజీసీ వేతనాలు పొందుతున్నంత మాత్రాన సమాన హక్కు కోరలేరన్న హైకోర్టు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 65 ఏండ్లకు పెంచాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కోట్టివేసింది. పదవీ విరమణ వయస్సును నిర్ణయించడం ప్రభుత్వ విధానపరమైన అంశమని, అలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది.
యూజీసీ వేతన శ్రేణులు అమలవుతున్నాయన్న కారణంతో ఇతర యూనివర్సిటీల అధ్యాపకులతో సమానంగా పదవీ విరమణ వయస్సు పెంపును కోరే హక్కు లేదని తేల్చిచెప్పింది. ప్రొఫెసర్ జయశంకర్అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీకి చెందిన బోధనా సిబ్బంది దాఖలు చేసిన మొత్తం 13 రిట్ పిటిషన్లపై జస్టిస్ కె.శరత్ విచారణ జరిపి తీర్పును వెలువరించారు.
పదవీ విరమణ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అచ్చమాంబ సహా పలువురు అధ్యాపకులు, తమకు కూడా 65 ఏండ్ల వరకు సేవల కొనసాగింపు కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీ అధ్యాపకుల మాదిరిగానే తమకూ యూజీసీ వేతన శ్రేణులు అమలవుతున్నాయని, 2025 జనవరి 28న ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 3 ద్వారా ఉన్నత విద్యాశాఖ పరిధిలోని యూనివర్సిటీల బోధనా సిబ్బంది పదవీ విరమణ వయస్సు 65 ఏండ్లకు పెంచిందని తెలిపారు.
ఇదే ప్రయోజనాన్ని వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యానవన విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు సైతం వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ... ఆయా విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యాశాఖ పరిధిలో కాకుండా వ్యవసాయ, పశుసంవర్ధక తదితర శాఖల పరిపాలనా నియంత్రణలో పనిచేస్తున్నాయని, జీఓ నంబర్ 3 ఉన్నత విద్యాశాఖ ఆధీనంలోని యూనివర్సిటీలకే వర్తిస్తుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు పంచాలా, వద్దా అన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికార పరిధిలోని అంశమని తేల్చి.. అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ
తీర్పు చెప్పారు.
