
- విమెన్స్ కయాక్ సింగిల్ 500 మీటర్ల ఈవెంట్లో సోనియా దేవి సెమీస్లో రెండో ప్లేస్లో నిలిచిన ఫైనల్కు క్వాలిఫై అయింది.
- విమెన్స్ హాకీ పూల్–ఎ మ్యాచ్లో ఇండియా 1–1తో సౌత్ కొరియాతో డ్రా చేసుకుంది. కొరియా 12వ నిమిషంలోనే గోల్ చేయగా.. నవనీత్ కౌర్ 44వ నిమిషంలో గోల్ కొట్టింది.
- చెస్ మెన్స్, విమెన్స్ జట్లు మూడో రౌండ్లో విజయాలు సాధించాయి.
హాంగ్జౌ: ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క! ఆసియా గేమ్స్లో ఒకే రోజు మూడు గోల్డ్ సహా 15 మెడల్స్తో ఇండియా పతకాల మోత మోగించింది. స్టీపుల్ఛేజ్లో అవినాశ్ ముకుంద్ సాబ్లే, షాట్పుటర్ తజిందర్ పాల్ సింగ్ తూర్ గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకోగా.. హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్తో కూడిన మెన్స్ ట్రాప్ టీమ్ మరో బంగారు పతకం అందించింది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, అథ్లెట్ నందిని బ్రాంజ్ మెడల్స్ రాబట్టగా.. ఏపీ అమ్మాయి యెర్రాజి జ్యోతి సిల్వర్తో మెరిసింది. మొత్తంగా ఒకే రోజు మూడు గోల్డ్, ఏడు సిల్వర్, ఐదు బ్రాంజ్తో ఈ సండే బెస్ట్ డే మారింది. ఆసియా గేమ్స్ చరిత్రలో ఇండియాకు ఒక రోజు ఇన్ని పతకాలు రావడం రికార్డు. ఓవరాల్ మెడల్స్లో ఇండియా హాఫ్ సెంచరీ దాటింది. ప్రస్తుతం 13 గోల్డ్ సహా 54 పతకాలతో పట్టికలో నాలుగో ప్లేస్లో కొనసాగుతోంది.
అవినాశ్ రికార్డు
ఆసియా గేమ్స్ 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో బంగారు పతకం సాధించిన తొలి ఇండియన్గా అవినాష్ సాబ్లే రికార్డు సృష్టించాడు. 29 ఏండ్ల అవినాశ్ 8నిమిషాల19.50 సెకండ్ల రికార్డు టైమింగ్తో రేసును పూర్తి చేసి ఈ ఎడిషన్ అథ్లెటిక్స్లో ఇండియాకు తొలి గోల్డ్ అందించాడు. ఈ క్రమంలో 2018 జకార్తా గేమ్స్లో ఇరాన్కు చెందిన న్ కీహానీ పేరిట ఉన్న (8:22.79సె) గేమ్స్ టైమింగ్ రికార్డును తిరగరాశాడు.
తూర్ తడాఖా
2018 ఎడిషన్లో గోల్డ్ నెగ్గి ఈ సారి ఫేవరెట్గా బరిలోకి దిగిన షాట్ పుటర్ తజిందర్ పాల్ అంచనాలను అందుకున్నాడు. పోటాపోటీగా సాగిన ఈవెంట్లో 1,2,5వ ప్రయత్నాల్లో ఫౌల్ చేసిన అతను నాలుగో ప్రయత్నంలో గుండును 20.16 మీటర్ల దూరం విసిరాడు. కానీ, సౌదీకి చెందిన మొహమ్మద్ దౌదా తన నాలుగో ప్రయత్నంలో 20.18 మీటర్లతో టాప్లోకి వచ్చాడు. తీవ్ర ఒత్తిడిలో తజిందర్ తన ఆరో, చివరి ప్రయత్నంలో 20.36 మీటర్ల త్రోతో టైటిల్ నిలబెట్టుకున్నాడు. దౌదా సిల్వర్ నెగ్గగా, చైనాకు చెందిన యాంగ్ లియు (19.97 మీ.) బ్రాంజ్ గెలిచాడు. విమెన్స్ 1500 మీ రన్ విమెన్స్లో హర్మిలన్ బెయిన్స్ 4 నిమిషాల 12.74 సెకండ్లతో సిల్వర్ నెగ్గగా, మెన్స్లో అజయ్ కుమార్ (3:38.94సె), జిన్సన్ జాన్సన్ (3:39.74సె) సిల్వర్, బ్రాంజ్ సొంతం చేసుకున్నారు. మెన్స్ లాంగ్జంప్లో మురళీ శ్రీశంకర్ 8.19 మీటర్లతో రజతం కైవసం చేసుకున్నాడు. వెటరన్ డిస్కస్ త్రోయర్ సీమా పునియా తన చివరి ఆసియా గేమ్స్లో 58.62 మీటర్లతో బ్రాంజ్ మెడల్ నెగ్గింది.
ఇండియా స్టార్ గోల్ఫర్ అదితి అశోక్ ఆసియా గేమ్స్ విమెన్స్ గోల్ఫ్లో ఇండియాకు తొలి మెడల్గా సిల్వర్ అందించింది. తొలి మూడు రౌండ్లలో సత్తాచాటిన ఆమె ఆఖరి రౌండ్లో కాస్త తడబడింది. ఏడు స్ట్రోక్ లీడ్తో ఫైనల్లోకి వచ్చి ఓ దశలో ఒకటి నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. పుంజుకొని రెండో స్థానంతో పోటీ ముగించి సిల్వర్ ఖాతాలో వేసుకుంది.
బ్యాడ్మింటన్ వెండి కొండలు..
ఆసియా గేమ్స్లో తొలి గోల్డ్ సాధించి చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఇండియా మెన్స్ బ్యాడ్మింటన్ టీమ్ కొద్దిలో చేజార్చుకుంది.గాయం కారణంగా సీనియర్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ దూరం అవ్వడంతో డీలా పడ్డ ఇండియా ఫైనల్లో 2–3తో చైనా చేతిలో పోరాడి ఓడింది. అయినా గేమ్స్లో తొలిసారి సిల్వర్ సాధించింది. హోరాహోరీగా సాగిన టైటిల్ ఫైట్లో తొలి సింగిల్స్లో లక్ష్యసేన్, డబుల్స్లో సాత్విక్–చిరాగ్ తమ ప్రత్యర్థులపై గెలిచారు. ఇండియాను 2–0తో లీడ్లో నిలిపి గోల్డ్పై ఆశలు రేపారు. మరో మ్యాచ్ గెలిస్తే గోల్డ్ సొంతమయ్యేది. కానీ, రెండో సింగిల్స్లో టాప్ ప్లేయర్ శ్రీకాంత్ 22–24, 9–21తో లి షిఫెంగ్ చేతిలో ఓడిపోయాడు. నాలుగో పోరులో అనుభవం లేని ధృవ్–సాయి ప్రతీక్ జంటతో పాటు ప్రణయ్ స్థానంలో బరిలోకి దిగిన మిథున్ మంజునాథ్ చివరి సింగిల్స్లో ఓడటంతో ఇండియా సిల్వర్తో తిరిగొచ్చింది.
కైనన్ డబుల్ ధమాకా
షూటింగ్ పోటీల ఆఖరి రోజు సీనియర్ షూటర్, హైదరాబాదీ కైనన్ చెనాయ్ హవా నడించింది. మెన్స్ ట్రాప్ టీమ్ ఫైనల్లో కైనన్, పృథ్వీరాజ్, జోరావర్ సింగ్ సంధుతో కూడిన ఇండియా 361 స్కోరుతో ఆసియా గేమ్స్ రికార్డును బ్రేక్ చేస్తూ గోల్డ్ నెగ్గింది. ఐదు రౌండ్లలో పృథ్వీ 119, జోరావర్ 120 పాయింట్లు రాబట్టగా కైనాన్ అత్యధికంగా 122 పాయింట్లతో సత్తా చూపెట్టాడు. కువైట్ (359), చైనా (354) సిల్వర్, బ్రాంజ్ గెలిచాయి. కైనన్, జోరావర్ ట్రాప్ వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్లో పోటీ పడ్డారు. క్వాలిఫికేషన్లో టాప్2లో నిలిచి గోల్డ్, సిల్వర్పై ఆశలు రేపారు. కానీ, ఆరుగురితో కూడిన ఫైనల్లో చివర్లో కాస్త తడబడ్డ కైనన్ 32 పాయింట్లతో బ్రాంజ్ నెగ్గగా, జోరావర్(23) ఐదో ప్లేస్తో సరిపెట్టారు.
విమెన్స్ ట్రాప్ టీమ్ ఫైనల్లో మనీషా కీర్ (114), ప్రీతి రజక్ (112), రాజేశ్వరి కుమారి (111)తో కూడిన ఇండియా 337 స్కోరుతో రెండో ప్లేస్తో సిల్వర్ నెగ్గింది. మొత్తంగా 22 మెడల్స్తో ఆసియా గేమ్స్లో ఇండియా షూటింగ్ టీమ్ బెస్ట్ పెర్ఫామెన్స్ చేసింది. ఇందులో 7 గోల్డ్, 9 సిల్వర్, 6 బ్రాంజ్ ఉన్నాయి.
మెరిసిన నందిని, జ్యోతి
ఆసియా గేమ్స్లో తొలి ప్రయత్నంలోనే తెలంగాణ అథ్లెట్ అగసార నందిని, ఏపీ అమ్మాయి యెర్రాజి జ్యోతి పతకాలతో మెరిశారు. ఏడు ఈవెంట్లతో కూడిన విమెన్స్ హెప్టాథ్లాన్లో 18 ఏండ్ల నందిని మొత్తం 5712 పాయింట్లతో మూడో ప్లేస్తో బ్రాంజ్ గెలిచింది. 2018 గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ స్వప్న బర్మన్ (5708) నాలుగో ప్లేస్తో సరిపెట్టింది.
హర్డిల్స్లో హైడ్రామా
హైడ్రామా నడిచిన విమెన్స్ 100 మీ. హర్డిల్స్ ఫైనల్లో జ్యోతి 13.04 సెకండ్లతో సిల్వర్ సాధించింది. తొలుత జ్యోతి, చైనా రన్నర్ వు యని ఫాల్స్ స్టార్ట్ కారణంగా డిస్క్వాలిఫై అవగా.. తర్వాత జడ్జీలు రేస్ కొనసాగించారు. ఇందులో చైనాకు చెందిన లిన్ యువి (12.74 సె) గోల్డ్ నెగ్గగా, యని (12.91), జ్యోతి సిల్వర్, బ్రాంజ్ గెలిచారు. కానీ, అథెట్లిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) రిజల్ట్పై ప్రొటెస్ట్ చేసింది. దాంతో టెక్నికల్ రూల్ 16.8 ప్రకారం ఫాల్స్ స్టార్ట్కు యని కారణమని తేల్చి ఆమెను డిస్క్వాలిఫై చేశారు. దాంతో జ్యోతి బ్రాంజ్ను సిల్వర్గా అప్గ్రేడ్ చేశారు.