- ప్రకటించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో: యూపీ, మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వలస కార్మికులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన 8 మందికి, యూపీలో కాలినడకన వెళ్తున్న కూలీలపైకి బస్సు దూసుకెళ్లడంతో చనిపోయిన ఆరుగురి కుటుంబాలకు రూ .రెండు లక్షల చొప్పున సాయం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ .50 వేల పరిహారం ప్రకటించారు. డెడ్బాడీలను వారి వారి బంధువులకు అప్పగించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. లాక్ డౌన్ ఎఫెక్టుతో ఉపాధి కోల్పోయిన కూలీలు సొంతూళ్లకు వెళ్తుండగా యూపీలో ఆరుగురు, మధ్యప్రదేశ్ లో ఎనిమిది మంది గురువారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి దిగ్భ్రాంతిని వ్యక్త చేస్తూ పరిహారం సాధ్యమైనంత తొందరలోనే మృతుల కుటుంబాలకు అందజేస్తామని తెలిపారు.
మహారాష్ట్ర నుంచి ఉత్తర ప్రదేశ్ కు చెందిన 70 మంది వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును.. బస్సు ఢీకొట్టడంతో 8మంది చనిపోయారు. మధ్యప్రదేశ్లోని గుణలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్ నగర్లో రోడ్డుపై నడిచివెళ్తున్న బీహార్కు చెందిన కూలీలపైకి బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు చనిపోయారు.