
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డు మాదిరే ఇక నుంచి యూపీఐ చెల్లింపులకు కూడా ‘ట్యాప్ అండ్ పే’ సదుపాయం అందుబాటులోకి రానుంది. వచ్చే నెల 31 నాటికి ఇది అన్ని యూపీఐ యాప్స్కు అందుబాటులోకి రావొచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. భీమ్, జీపే, పేటీఎం, ఫోన్పే తదితర యూపీఐ యాప్ల వినియోగదారులు ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎన్పీసీఐ యూపీఐ ట్యాప్ అండ్ పేను అధికారికంగా ఈ ఏడాది సెప్టెంబరులో ‘యూపీఐ పే అడిషనల్ మోడ్’గా ప్రారంభించబడింది. సాధారణంగా అయితే యూపీఐతో డబ్బు చెల్లించడానికి కోడ్ను స్కాన్ చేయాలి. లేదా ఫోన్నంబరు ఎంటర్ చేయాలి. ఈ కొత్త పద్ధతిలో, స్కానింగ్ చేయడానికి బదులుగా, మీరు మీ పరికరాన్ని రిసీవర్పై పెట్టి కొన్ని సెకన్లు ఉంచితే చాలు.
అచ్చం క్రెడిట్కార్డుకు చేసినట్టే అన్నమాట. ఫోన్లో ఉంటే ఎన్ఎఫ్సీ చిప్ ద్వారా డబ్బు మన ఫోన్ నుంచి మర్చంట్కు వెళ్తుంది. ప్రస్తుతం ఉన్న యూపీఐ పరిమితులే ట్యాప్ అండ్ పే పేమెంట్ మోడ్లకు వర్తిస్తాయి. ఈ పేమెంట్ మోడ్ని ఉపయోగించడానికి కస్టమర్ ఫోన్లో కచ్చితంగా ఎన్ఎఫ్సీ చిప్ ఉండాలి. క్యూఆర్లు/సౌండ్బాక్స్లు లేదా యూపీఐ స్మార్ట్ ట్యాగ్లలోని ఎన్ఎఫ్సీ ట్యాగ్లు కస్టమర్ ఫోన్ నుంచి డబ్బు తీసుకుంటాయి. లావాదేవీని పూర్తి చేయడానికి మీ డివైజ్కు ఇంటర్నెట్ అవసరం. యూపీఐ పిన్ కూడా కావాలి. మీ లావాదేవీ రూ.500 లోపు ఉండి, యూపీఐ లైట్మోడ్ను వాడితే పిన్ అవసరం ఉండదు. ప్రస్తుతం భీమ్, పీటీఎం యాప్లు ట్యాప్ అండ్ పే ఫీచర్ను సపోర్ట్ చేస్తున్నాయి.
'ట్యాప్ & పే' ఫీచర్ను ఉపయోగించడం ఇలా..
1. యూపీఐ యాప్ను ఓపెన్ చేయండి. ట్యాప్ అండ్ పే సింబల్పై క్లిక్ చేయండి.
2. రిసీవర్కు పంపాలనుకుంటున్న మొత్తాన్ని టైప్ చేయండి. రిసీవర్ డివైజ్పై మీ ఫోన్ను పెట్టి దాన్ని నొక్కండి.
3. రెండు డివైజ్లకూ ఎన్ఎఫ్సీ ఉండాలి. యాప్ రిక్వెస్ట్ చేయగానే పిన్ ఎంటర్ చేయాలి.
4. ఇప్పుడు లావాదేవీ విజయవంతమవుతుంది. అన్నీ సరిగ్గా జరిగితే, మీరు మీ స్క్రీన్పై లావాదేవీ విజయవంతమైనట్టు మెసేజ్ను చూస్తారు.