జీవోలను వెంటనే అప్‌‌లోడ్‌‌ చేయండి : హైకోర్టు

జీవోలను వెంటనే అప్‌‌లోడ్‌‌ చేయండి : హైకోర్టు
  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు, నోటిఫికేషన్స్, రూల్స్, జీవోలు, సర్క్యులర్స్‌‌ అన్నింటినీ తక్షణమే అధికారిక వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. 

జీవోలను అప్‌‌లోడ్‌‌ చేయడం లేదంటూ బీఆర్‌‌ఎస్‌‌కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌‌ వేసిన పిటిషన్‌‌ను జస్టిస్‌‌ సూరేపల్లి నందా మంగళవారం విచారించారు. పిటిషనర్‌‌ లాయర్‌‌ రామవరం చంద్రశేఖర్‌‌ రెడ్డి వాదిస్తూ..  జీవోలను పబ్లిక్‌‌ డొమైన్‌‌లో పెట్టడం లేదన్నారు. 

మంత్రి మండలిలో సభ్యులుకాని మల్లు రవి, జితేందర్‌‌ రెడ్డి్, ఆదిత్యనాద్‌‌ దాస్, శ్రీనివాసరాజులకు కేబినెట్‌‌ హోదాను కల్పిస్తూ జారీ చేసిన జీవోలు అధికారిక వెబ్‌‌సైట్‌‌లో లేవన్నారు. ప్రజా సంక్షేమ అంశాలకు సంబంధించినవి కూడా అందుబాటులో లేవన్నారు. వాదనలపై స్పందించిన న్యాయమూర్తి.. ఎనిమిది వారాల్లోగా జీవోలను వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్‌‌పై విచారణను ముగిస్తున్నట్లు చెప్పారు.