న్యూఢిల్లీ: ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో 14,624 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసింది. 2023 ప్రిలిమ్స్ పరీక్షను గత నెల 28న నిర్వహించారు. క్వాలిఫై అయిన అభ్యర్థుల పేర్లు, సీరియల్, రోల్ నంబర్ల లిస్టును యూపీఎస్సీ వెబ్ సైట్ http://upsc.gov.in లో అప్ లోడ్ చేశామని అధికారులు తెలిపారు. అయితే, క్వాలిఫై అయిన అభ్యర్థులంతా ఎగ్జామినేషన్ రూల్స్ ప్రకారం సివిల్స్ మెయిన్ పరీక్ష కోసం మరోసారి డీటెయిల్డ్ అప్లికేషన్ ఫాం నింపాలని అధికారులు వెల్లడించారు. అప్లికేషన్ ఫాం నింపేందుకు సూచనలను త్వరలో వెబ్ సైట్లో పొందుపరుస్తామని చెప్పారు. అలాగే, ప్రిలిమినరీ మార్కులు, కటాఫ్ మార్కులు, ఆన్సర్ కీని కూడా వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తామని పేర్కొన్నారు.
