
వాషింగ్టన్ : కరోనా కేసులు పెరుగుతుండటంతో అమెరికాలో ఫార్మా సంస్థలకు కరోనా వైరస్ టెస్ట్ చేసే అవకాశం కల్పించారు. దేశంలో రోజుకు 25 నుంచి 30 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. లక్షలాది మందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో మరింత వేగవంతంగా కరోనా టెస్ట్ లు చేసేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త పద్దతిలో చేస్తున్న యాంటీ బాడీ టెస్ట్ లతో పాటు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు కూడా ఫార్మా కంపెనీలు చేస్తాయని అమెరికా హెల్త్ సెక్రటరీ అలెక్స్ అజార్ చెప్పారు. కరోనా టెస్ట్ ల కోసం ఫార్మా కంపెనీలకు అవకాశం ఇవ్వటం మాకు సంతోషంగా ఉంది. ఫార్మా కంపెనీలు, హెల్త్ వర్కర్లు కరోనా నివారణకు కీలక పాత్ర పోషించాలనేదే మా ఉద్దేశం అని చెప్పారు. కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ లక్షలాది మందికి యాంటీ బాడీ టెస్ట్ లను నిర్వహిస్తామని అలెక్స్ చెప్పారు. ఈ విధానం ద్వారా ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు కచ్చితమైన రిజల్ట్స్ వస్తాయని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు సరిపడ యాంటీ బాడీస్ ఉన్నాయా లేదా అన్నది కూడా చెక్ చేయనున్నారు.