కరోనావైరస్ కారణంగా ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలనే వివాదాస్పద నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) జూలై 6న ప్రకటించిన ఈ విధానానికి వ్యతిరేకంగా హార్వర్డ్ మరియు ఎంఐటి విశ్వవిద్యాలయాలు అనేక ఇతర సంస్థల సహకారంతో కోర్టుకు వెళ్లాయి. ఈ కేసును పరిశీలించిన ఫెడరల్ న్యాయమూర్తి అల్లిసన్ బురోస్.. అమెరికా ప్రభుత్వం తన నిర్ణయాన్ని రద్దు చేయడానికి అంగీకరించిందని తెలిపారు.
ఐసీఈ ఉత్తర్వుల ప్రకారం.. ఎవరైతే విద్యార్థులు తమ తరగతులకు ఆన్లైన్లో మాత్రమే హాజరవుతున్నారో వారందరూ తమ వీసాలను క్యాన్సిల్ చేసుకొని దేశం విడిచి వెళ్లాలని తెలిపింది. ఇది కుదరకపోతే.. వ్యక్తిగతంగా పాఠాలు బోధించే కళాశాలకు మారాలని ఐసీఈ తెలిపింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హార్వర్డ్ మరియు ఎంఐటి కోర్టును ఆశ్రయించాయి. ఈ ఉత్తర్వుల వల్ల విద్యార్థులకు వ్యక్తిగతంగా మరియు ఆర్థికంగా కూడా భారీ నష్టాన్ని కలిగిస్తాయని విశ్వవిద్యాలయాలు తమ దావాలో పేర్కొన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ప్రకారం.. 2018-19 విద్యా సంవత్సరానికి గాను యూఎస్ లో పదిలక్షలకు పైగా విదేశీ విద్యార్థులు ఉన్నారు. అమెరికా తన నిర్ణయాన్ని వెనకకు తీసుకోవడం పలు దేశాలలోని విద్యార్థులకు శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.
కరోనా మహమ్మారి వల్ల కళాశాలలు తెరవడానికి భయపడుతున్న విద్యాసంస్థలపై ఒత్తిడి తెచ్చేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌజ్ వర్గాలు భావిస్తున్నాయి.
For More News..