V6 News

గంబుసియా చేపలతో దోమల బెడద పోతుందా.?

గంబుసియా చేపలతో దోమల బెడద పోతుందా.?

గ్రేటర్​లో దోమల నివారణ కోసం ప్రతి సంవత్సరం జీహెచ్ఎంసీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది.  2020–-21 సంవత్సరంలో రూ. 25 కోట్లు,  2021– 22 సంవత్సరంలో రూ.25 కోట్లు,  2022-24లో రూ. 30 కోట్లు,  ప్రస్తుత బడ్జెట్లో  ఇంకా ఎక్కువ ఖర్చు చేశారన్నది అంచనా.  అయితే,  ఇవి కేవలం అంకెలకు మాత్రమే పరిమితమైనవి అని స్థానికులు ఆరోపిస్తున్నారు.  కూలర్లు,  టైర్లు, తాగి పడేసిన కొబ్బరి బొండాలలో నీరు చేరడం,  చెరువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా ఉంటున్నాయి.  కానీ, ఒక్క అధికారి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు.  దోమల నివారణకు  గత నాలుగేళ్ల క్రింద జోన్ కు రెండు చొప్పున 12 మస్కిటో ట్రాఫిక్ మిషన్లు కొన్నా ఆపరేట్ చేయకపోవడంతో మూలపడ్డాయి.  జీహెచ్ఎంసీ  పరిధిలో 134 చెరువులు ఉన్నా కూడా ఎవరు కూడా వాటి గురించి పట్టించుకోవట్లేదు.  వాస్తవానికి దోమల బెడద తగ్గాలంటే,  ఇక్కడ దోమల వ్యాప్తి అంతకు అంత పెరిగి జిహెచ్ఎంసి పరిధిలో వైరల్ ఫీవర్  డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి.  జనాల డబ్బులు లూటీ అవుతున్నాయి.  ఒక్కొక్కసారి  చిన్నపిల్లల ప్రాణాలకు ప్రమాదకరంగా దోమలు మారాయి..  ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 300 ఫాగింగ్ యంత్రాలు ఉన్నాయి.  

డివిజన్​కు  రెండు యంత్రాలు కేటాయించారు.  పెద్ద మిషన్లు 60 ఉన్నాయి.  యంత్రాలు వాడడానికి పెట్రోల్, డీజిల్ నింపుతారు.  ఫాగింగ్ మెషిన్లు  వాడకపోగా ఇందులో వాడినట్టు చూపి కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నతస్థాయి అధికారులు స్పందించాలి.  దోమలు ఒక్కసారి వృద్ధిలోకి వచ్చాక ఎంత ఫాగింగ్ చేసినా దోమలు చనిపోయే అవకాశం తక్కువ.  గంబుసియా( మస్కిటో చేపలు ) ఎక్కువగా పశ్చిమ అమెరికా ప్రాంతాల్లో లభ్యమవుతాయి వీటికి ఆహారం దోమల లార్వా.  కొన్ని రాష్ట్రాల్లో వీటిని దిగుమతి చేసుకొని ఇప్పటికీ వాడటం జరుగుతుంది. ఈ గంబుసియా చేపలను దిగుమతి చేసుకొని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ చెరువులలో వదిలినట్లయితే మలేరియా, డెంగ్యూ సీజనల్​ వ్యాధుల నుంచి ప్రజలు తప్పించుకునే 
అవకాశం ఉంది. 


‌‌- బండి జయసాగర్​ రెడ్డి