- త్వరలో పనుల పరిశీలనకు వస్తానన్న ఇరిగేషన్ మంత్రి
- మినిస్టర్ వస్తేనే గేట్లు తెరుచుకునే చాన్స్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : త్వరలో కాళేశ్వరం పనుల పరిశీలనకు వస్తానన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రకటనతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీలు, పంప్హౌజ్ల వద్ద ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. నిరుడు వరదలకు కన్నెపల్లి పంప్ హౌజ్ మునగడం, ఈ ఏడాది మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం బ్యారేజీకి సీపేజ్లు ఏర్పడడం తెలిసిందే. ఆయా చోట్ల పనుల పరిస్థితి ఏమిటో గత బీఆర్ఎస్ సర్కారు బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు.
ప్రతిపక్షాలు, మీడియాకు సైతం ప్రవేశం లేకుండా మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్హౌజ్ వద్ద చెక్పోస్టులు పెట్టించింది. ఆ సర్కారు పెట్టిన చెక్ పోస్టులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ మంత్రి వస్తేనే ఈ గేట్లు తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పెద్దలు ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు.
అనుకున్నట్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం కావడంతో కాళేశ్వరంపై ఎలా ముందుకెళ్తారన్న దానిపై అందరిలో ఆసక్తి మొదలైంది. ఇందుకు తగ్గట్లుగానే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఇటీవల రివ్యూ నిర్వహించిన మంత్రి ఉత్తమ్.. త్వరలోనే తాను కాళేశ్వరం పనుల పరిశీలనకు వస్తానని, అందరూ రెడీగా ఉండాలని ఆదేశించడంతో ఆఫీసర్లంతా అప్రమత్తమయ్యారు.
పనులపై నో క్లారిటీ..
నిరుడు జులైలో కురిసిన భారీ వర్షాలకు కన్నెపల్లి పంప్హౌజ్ నీట మునిగింది. ప్రొటెక్షన్ వాల్ కూలి మోటార్లు డ్యామేజ్ అయ్యాయి. సంఘటన జరిగిన రోజు నుంచి పంప్హౌజ్ గేట్లు క్లోజ్ చేసి పెట్టారు. ఇరిగేషన్ ఆఫీసర్లు, కాంట్రాక్ట్ సంస్థ వెహికిల్స్కు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. ఏడాదిన్నరగా మీడియాను లోపలికి అనుమతించట్లేదు. 17 మోటార్లలో ఇప్పటి వరకు ఎన్ని రిపేర్ చేశారో క్లారిటీ లేదు. జనవరిలో 5 మోటార్లను రన్ చేసి గోదావరి జలాలను ఎత్తిపోశారు.
మిగిలిన మోటార్ల సంగతేంటో తెలియడం లేదు. ఇదిలా ఉంటే సరిగ్గా ఎన్నికలకు ముందు అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. మొత్తం మూడు పిల్లర్లు (పియర్స్) దెబ్బతిన్నాయి. వెంటనే అప్పటి సర్కారు బ్యారేజీ వద్ద రోడ్డు బ్లాక్ చేసి చెక్పోస్టులు పెట్టింది. లోపల ఏం జరుగుతున్నదో బయటకు తెలియనివ్వలేదు. మీడియాకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఏడో బ్లాక్లోని పిల్లర్ల దగ్గర పనులు జరుగుతున్నాయని, రింగ్బండ్ నిర్మాణం చేస్తున్నామని ఆఫీసర్లు చెబుతున్నా ఎవరూ చూసింది లేదు. పనులకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు రావడం లేదు. తాజాగా ఇరిగేషన్ మంత్రి రాకతోనైనా మీడియాకు పర్మిషన్ దొరుకుతుందా? పనుల పరిస్థితి ఏమిటో తెలుసుకునే అవకాశం ప్రజలకు దక్కుతుందా? అనే చర్చ మొదలైంది.
బ్యారేజీలు, పంప్హౌజ్ల దగ్గర అలర్ట్గా ఉన్నం
కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన బ్యారేజీలు, పంప్హౌజ్ల దగ్గర ఇరిగేషన్ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. భూమిలోకి కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల రిపేర్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. గోదావరి నదిలో తాత్కాలిక పనులు జరుగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్హౌజ్ల దగ్గర చెక్పోస్టులు అలాగే కొనసాగుతున్నాయి. అనుమతి ఉన్నవాళ్లనే లోపలికి పంపిస్తున్నాం.
తిరుపతిరావు, ఇరిగేషన్ ఈఈ, భూపాలపల్లి జిల్లా