‘క్రాక్’ చిత్రంలోని పాత్రతో తెలుగు సినిమా తనకొక వరంలా మారిందని చెబుతోంది వరలక్ష్మీ శరత్కుమార్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న వరలక్ష్మీ ‘కోట బొమ్మాళి పీఎస్’ లో కీలక పాత్ర పోషించింది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్లో తేజ మార్ని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు.
చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ ఆఫీసర్ క్రిమినల్గా మారితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తా. పోలీసులపై పొలిటికల్ ప్రెజర్ ఏ విధంగా ఉంటుందనేది ఇందులో చూపించారు. అలాగే ఓటు హక్కు గురించిన మెసేజ్ కూడా ఉంటుంది. ఎలక్షన్ టైమ్లో ఈ సినిమా రావడం మరింత ఆసక్తికరం. నా కెరీర్లో ఎక్కువ పోలీస్ క్యారెక్టర్సే వస్తున్నాయి. తమిళంలో చాలా చేశాను కానీ.. తెలుగు ఆడియెన్స్కు మాత్రం ఫస్ట్ టైమ్ పోలీస్ గెటప్లో కనిపిస్తున్నా. స్క్రీన్ప్లే చాలా ఇంటరెస్టింగ్గా ఉంటుంది. ‘నాయట్టు’కి రీమేక్ అయినా.. దానికి దీనికి చాలా మార్పులు చేశారు. ఇందులో ని పాత్ర కోసం స్మోకింగ్ చేయడం చాలెంజింగ్గా అనిపించింది.
ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ ఇలాంటి సీన్ చేయలేదు. అందుకే చాలా ఇబ్బందిగా ఆ సీన్స్ చేశా. ఇందులో యాక్షన్ కంటే మైండ్ గేమ్ ఎక్కువగా ఉంటుంది. పొలిటికల్ సిస్టమ్, పోలీస్ సిస్టమ్ గురించి చూపించాం కానీ.. ఏ పార్టీకి సంబంధం ఉండదు. దర్శకుడు తేజ మార్ని చాలా క్వాలిటీగా తీశారు. ఇక నేను నటించిన ‘హనుమాన్’ సంక్రాంతికి విడుదలవుతోంది. ‘శబరి’ కూడా రిలీజ్కు రెడీ అవుతోంది. కన్నడలో సుదీప్తో కలిసి ‘మ్యాక్స్’ చిత్రంలో నటిస్తున్నా. సురేష్ కృష్ణ గారి డైరెక్షన్లో రాజేంద్ర ప్రసాద్ గారితో ఓ మూవీ చేస్తున్నా. బెస్ట్ క్యారెక్టర్స్ చేయడమే నా గోల్. కథ నచ్చితే ఏ భాషలోనైనా నటిస్తా’’.