ఘనంగా వసంత పంచమి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

ఘనంగా వసంత పంచమి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

వసంత పంచమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సరస్వతి మాతా ఆలయాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ క్షేత్రంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేద వ్యాస మహార్షికి సరస్వతీ దేవికి అభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులుతీరారు. దీంతో భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడుతుంది. 

మరోవైపు సిద్దిపేట జిల్లా- వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు ఆలయ సిబ్బంది. అమ్మవారి పుట్టిన రోజు కావడంతో దర్శనం కోసం ఉదయాన్నే  భక్తులు క్యూలైన్ లు కట్టారు. 

అటు ముషీరాబాద్ శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతి అమ్మవారి ఆలయంలో  ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకలు, అర్చనలు, హోమం, అక్షరభ్యాసాలు నిర్వహిస్తున్నారు. బాసర వెళ్లలేని వారంతా ఈ ముషీరాబాద్ లోని  శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయానికి వస్తుంటారని ఆలయ అధికారులు తెలిపారు. 

అమ్మవారి ప్రసాదాలు..

ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతున్నాయా? వృత్తిలో వచ్చే ఆటంకాల వల్ల ఇబ్బందులు పడుతున్నారా? అయితే సరస్వతీ దేవిని పూజించే సమయంలో ఈ నైవూద్యాలు సమర్పించడం వల్ల వాటి నుంచి విముక్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.

వసంత పంచమి రోజు ( ఫిబ్రవరి 14) సరస్వతీ దేవి అనుగ్రహం కోసం ఈ నైవేద్యాలు సమర్పించండి. వృత్తిలో, చదువులో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెబుతున్నారు.  వసంత పంచమి రోజున సరస్వతీ దేవితో పాటు శివుడు, విష్ణువుని పూజించడం ప్రత్యేక ఆచారం. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు పూజ సమయంలో ఐదు ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల సరస్వతీ దేవి ఆశీస్సులు లభించి జీవితంలోని బాధలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

సరస్వతీ దేవి అనుగ్రహంతో జ్ఞానం, వాక్కుకి సంబంధించిన లోపాలు తొలగిపోతాయి. పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు స్వీట్లు సమర్పించడం వల్ల సరస్వతీ దేవి ప్రత్యేక అనుగ్రహం పొందుతారు. వసంత పంచమి రోజు పసుపు రంగుకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే పసుపు రంగు స్వీట్లు ఎక్కువగా నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే సంపద, సంతోషం, శ్రేయస్సు ప్రసాదిస్తుందని నమ్ముతారు.

స్వీట్ బూందీ

వసంత పంచమి రోజు  సరస్వతీ దేవికి ఇష్టమైన  స్వీట్ బూందీ. పూజ సమయంలో అమ్మవారికి స్వీట్ బూందీ సమర్పిస్తే సకల బాధలు తొలగిపోతాయి. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బూందీ లడ్డు సమర్పించి ఈ ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టండి. ఇలా చేయడం వల్ల సరస్వతీ దేవి దయ మీపై ఉంటుంది. అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి.

పరమాన్నం

అమ్మవారికి పాలు, వెన్న, నెయ్యి అంటే మహా ప్రీతి. అందుకే వసంత పంచమి రోజు బెల్లం వేసి పరమాన్నం చేసి సమర్పించాలి. దేశీ నెయ్యి, చక్కెర లేదా బెల్లం, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ వేసి పరమాన్నం తయారు చేసి భోగంగా సమర్పించండి. కుంకుమ పువ్వు వేసి తయారు చేసిన ఖీర్ కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు.

మాల్పువా

సరస్వతి దేవికి మరొక ఇష్టమైన పదార్దం మాల్పువా .. పిల్లలకు చదువులో, పెద్దలకు వృత్తిలో ఆటంకాలు ఎదురైతే వాటిని అధిగమించేందుకు సరస్వతీ దేవికి మాల్పువా సమర్పించండి. ఇది నైవేద్యంగా పెట్టడం వల్ల మానసిక వికాసాన్ని పొందుతారు. తెలివితేటలు మెరుగవుతాయి.సరస్వతీ దేవి అనుగ్రహం పొందటం కోసం మీ పిల్లలతో తప్పని సరిగా మాల్పువా పూజలో పెట్టించండి. చదువులో రాణిస్తారు.

శనగపిండి లడ్డూ

వసంత పంచమి రోజు శనగపిండి లడ్డూను సమర్పించడం వల్ల సరస్వతీ దేవి అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు దేశీ నెయ్యితో చేసిన శనగ పిండి లడ్డూ అమ్మవారికి సమర్పించండి. సరస్వతీ దేవితో పాటు దేవగురువు బృహస్పతి, విష్ణువు అనుగ్రహాలు కూడా లభిస్తాయి.

రాజ్ భోగ్

సరస్వతీ దేవికి  రాజ్ భోగ్ ప్రసాదమంటే ఎంతో ఇష్టం. పాలతో చేసే ఈ పదార్థం అమ్మవారికి ఎంతో ప్రీతిప్రాతమైనది. రాజ్ భోగ్ సమర్పించడం వల్ల అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు. దీనితో పాటు సరస్వతీ దేవికి పసుపు వస్త్రాలు, పసుపు మిఠాయిలు పెట్టవచ్చు. సరస్వతీ దేవి పూజ సమయంలో రాజ్ భోగ్ సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారు. దీనితో పాటు శనగపిండితో చేసిన జిలేబి కూడా పెట్టుకోవచ్చు.