ఓసీల్లో కాలిపోతున్న వెహికల్స్...ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని డ్యూటీలు చేస్తున్న కార్మికులు

ఓసీల్లో కాలిపోతున్న వెహికల్స్...ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని డ్యూటీలు చేస్తున్న కార్మికులు
  •     నిర్వహణ లోపంతో దగ్ధమవుతున్న కోట్ల విలువైన భారీ వాహనాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భానుడి భగభగలు, భూమిలోంచి వస్తున్న వేడికి తోడు మెయింటెనెన్స్​ సరిగా లేకపోవడంతో ఓపెన్​కాస్టు గనుల్లో వెహికల్స్​ కాలిపోతున్నాయి. సింగరేణికి రూ. కోట్లలో నష్టం కలుగుతోంది. కోల్​ ప్రొడక్షన్​లో కీలక పాత్ర పోషిస్తున్న ఓపెన్​కాస్టు మైనింగ్​లో షవల్స్, డంపర్లదే ప్రధాన పాత్ర. రూ. కోట్ల విలువైన వెహికల్స్​ కాలిపోతుండడంతో కార్మికులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని పని చేస్తున్నారు. ఈక్రమంలో సింగరేణి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోకుండా అధికోత్పత్తిపైనే దృష్టి పెడుతోందనే విమర్శలున్నాయి.

కాలిపోతున్న వెహికల్స్..

సింగరేణిలో 18 ఓపెన్​కాస్టు గనులు ఉన్నాయి. కంపెనీలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిలో సింహ భాగం ఓసీలదే. వేసవిలో భానుడి ప్రతాపంతో ఓపెన్​కాస్టు గనుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓసీల్లో 42 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం కామన్​గా మారింది. ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, శ్రీరాంపూర్, ఆర్జీ, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల్లో మూసివేసిన అండర్​ గ్రౌండ్​ మైన్స్​లను ఓసీలుగా మార్చి సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ఈ క్రమంలో పలు ఓసీల్లో కింది నుంచి సెగలతో కూడిన పొగలు వస్తుంటాయి. ఓ వైపు భానుడి భగభగలు, మరోవైపు పొగలతో కూడిన వేడి సెగలు వెహికల్స్​ హీటెక్కుతున్నాయి. షార్ట్​ సర్క్యూట్​తో కాలిపోతున్నాయి. ఇటీవల మణుగూరు ఏరియాలో రూ.3 నుంచి రూ.5 కోట్ల విలువైన షావల్​ కాలిపోయింది. 

వెహికల్​ లో నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన మరో వెహికల్​ ఆపరేటర్​ వైర్​లెస్​ సెట్​ ద్వారా సమాచారం ఇవ్వడంతో కాలిపోయిన షావల్​ ఆపరేటర్​ దూకేశాడు. లేదంటే సజీవ దహనమయ్యేవాడు. మణుగూరు ఏరియాలోని ఓసీల్లో తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా షావల్స్, డంపర్స్​తో పాటు ఇతర వెహికల్స్​ కాలిపోతుండడంతో కార్మికులు ఆందోళనకు గురవుతుండగా, సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లుతోంది. మెయింటెనెన్స్​ సరిగా లేకపోవడమే ప్రమాదాలకు కారణమని కార్మికులు వాపోతున్నారు.

మణుగూరు ఏరియాలోని పీవో ఓసీలో 2024లో ఓబీ కాంట్రాక్టర్​కు చెందిన టిప్పర్​ క్యాబిన్​ నుంచి మంటలు వచ్చాయి. ఆపరేటర్​ దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది.

మణుగూరు ఏరియాలోని ఓసీలో సాని ట్రక్​ టిప్పర్​ నుంచి పొగలు వచ్చాయి. షార్ట్​ సర్క్యూట్ తో క్యాబిన్​లో నుంచి పొగలు రావడాన్ని ఆపరేటర్​ గమనించాడు.

2024లో గోదావరిఖనిలోని ఓసీలో పని చేస్తున్న షావల్​లో షార్ట్​ సర్క్యూట్​తో మంటలు, పొగలు వచ్చాయి. 

భూపాలపల్లి ఏరియాలో 2025లో వంద టన్నుల కెపాసిటీ ఉన్న డంపర్​ షార్ట్​సర్క్యూట్​తో క్యాబిన్​లో మంటలు రాగా, ఆపరేటర్​ క్యాబిన్​ నుంచి దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది.

బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓసీలో 2025లో వంద టన్నుల కెపాసిటీ ఉన్న డంపర్​ క్యాబిన్​లో మంటలు, పొగలు రావడాన్ని గుర్తించిన ఆపరేటర్​ దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు.

 భూపలపల్లి ఏరియా కేటీకేఓసీ–2లో 2023లో షార్ట్ సర్క్యూట్ తో​3 క్యూబిక్​ మీటర్ల కెపాసిటీ ఉన్న షావెల్​ క్యాబిన్ లో నుంచి మంటలు, పొగలు రావడంతో ఆపరేటర్​ అందులో నుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి.

బెల్లంపల్లి ఏరియాలో 2022లో లోడింగ్​ టైంలో షావెల్​ వెనుక భాగంలో మంటలు, పొగలు రావడంతో ఆపరేటర్​ గుర్తించి అక్కడి నుంచి దూకేశాడు.

 2021లో కేటీకే సెక్టార్–1 ఓసీ–1లో 3 క్యూబిక్​ మీటర్ల కెపాసిటీ ఉన్న షావెల్​ షార్ట్​సర్క్యూట్​కు గురైంది. మణుగూరు ఏరియాలో పీకే ఓసీలో 2021లో జరిగిన రోడ్​ యాక్సిడెంట్​లో 5 క్యూబిక్​ మీటర్ల కెపాసిటీ ఉన్న షావెల్​ షార్ట్​ సర్క్యూట్​తో కాలిపోయింది. దీంతో సంస్థకు రూ. 6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.

 2021లో 5 క్యూబిక్​ మీటర్​ కెపాసిటీ ఉన్న షావెల్​ కోల్​ బెంచ్​ వద్ద లోడింగ్​ చేస్తుండగా కాలిపోయింది. ఆపరేటర్​ పొగను గుర్తించి క్యాబిన్​ నుంచి బయటకు దూకేశారు.