వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం భారీగా వచ్చింది. 36 రోజుల హుండీ ఆదాయం రూ.2 కోట్ల 19 లక్షల 35 వేల 165రూపాయలు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 124 గ్రాముల బంగారం, 10 కిలోల 500 గ్రాముల వెండి వచ్చినట్టు వెల్లడించారు.ఆలయ ఓపెన్ స్లాబ్ లో పోలీసు భద్రత నడుమ అధికారులు, సిబ్బంది హుండీ ఆదాయం లెక్కించారు.
వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ రాష్ర్టాల నుంచి వేలాది మంది తరలివస్తారు. ఆలయంలో స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. కోడె మొక్కులు చెల్లిస్తారు.
రూ.76 కోట్లతో ఆలయ విస్తరణ..
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి 2024 నవంబర్ 20న శంకుస్థాపన చేశారు. తొలి విడతలో రూ.76 కోట్ల నిధులు మంజూరు చేయగా పనులు జరుగుతున్నాయి. అలాగే మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రూ.42 కోట్ల నిధులతో 80 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నారు. వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా డెవలప్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
