రాలుతున్న రాజన్న కోడెలు .. మూగ జీవాలకు మృత్యు పాశానంలా తిప్పాపూర్‌‌ గోశాల

రాలుతున్న రాజన్న కోడెలు .. మూగ జీవాలకు మృత్యు పాశానంలా తిప్పాపూర్‌‌ గోశాల
  • రెండు రోజుల్లో 15, వారంలో మొత్తం 30 దాకా మృతి
  • ఇటీవల కురిసిన వర్షంతో బురదమయంగా గోశాల ఆవరణ 
  • గోశాలలో 500 కెపాసిటికి .. 1300 ఉంచడంతో ఉక్కిరిబిక్కిరి 
  • అనారోగ్యం బారినపడిన వాటికి చికిత్స చేస్తున్న వెటర్నరీ సిబ్బంది 
  • దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సందర్శన  
  • కోడెలను ఉంచిన తీరుపై ఆఫీసర్లు, సిబ్బంది ఆగ్రహం 
  • అర్హులైన రైతులకు వెంటనే కోడెలు పంపిణీ చేయాలని ఆదేశాలు 

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు మొక్కులుగా ఇచ్చిన కోడెలు చనిపోతున్నాయి. రెండురోజుల్లో 15 మృతిచెందగా.. వారంలో మొత్తం 30 దాకా చనిపోయాయి. కళేబరాలను  ఆలయ సిబ్బంది ట్రాక్టర్​లో వేసుకొని మూల వాగులో పూడ్చిపెడుతున్నారు. దీంతో అలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. నాలుగు రోజుల కింద పడిన భారీ వర్షానికి తిప్పాపూర్ లోని ఆలయ గోశాల పూర్తిగా బురదమయమైంది. దీంతో కోడెలు  అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. వర్షంలో కోడెలు తడవడంతో చాలా వరకు  అనారోగ్యం బారిన పడ్డాయి.  500 కెపాసిటి గల గోశాలలో 1200పైగా ఉంచడంతో  ఇబ్బందిగా మారింది. 

అనారోగ్యం బారినపడినవి, చిన్నవి వేర్వేరుగా ఉంచేందుకు స్థలం లేకపోవడంతో అన్నింటిని కలిపే ఉంచుతున్నారు. దీంతో తొక్కిసలాటలో చిన్నవి చనిపోతున్నాయి.  గోశాలలో ప్రస్తుతం 24 మంది సిబ్బంది షిప్టుల ప్రకారం పని చేస్తున్నారు.  కోడెల సంఖ్యకి అనుగుణంగా లేరు. కెపాసిటి మించి కోడెలు పెరిగితే అర్హులైన రైతులకు పంపిణీ చేయాల్సి ఉండగా అధికారులు  నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కోడెలు పంపిణీ చేయపోతుండడంతో అధికం  అవుతూ ఉక్కిరిబిక్కిరి అయి చనిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి.  కాంట్రాక్టర్ ​పచ్చిగడ్డి రోజుకు 6 ట్రిప్పులు తేవాల్సి ఉండగా ఇటీవల వర్షం కారణంగా ఒకటి, రెండు మాత్రమే తెచ్చారు. 

దీంతో వాటికి సరిగా ఆహారం అందడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల భక్తులు ఉచితంగా ఇచ్చిన  ఎండుగడ్డి కూడా వానకు తడిసిపోయింది. కొంత అరబెట్టగా.. కొంత ఖరాబ్ అయింది. రాజన్న ఆలయ కోడెల పంపిణీ  కమిటీ చైర్మన్​గా ఉన్న జిల్లా కలెక్టర్​ వెంటనే అర్హులకు అందించాలని రైతులు కోరుతున్నారు. రూ. కోట్లలో ఆదాయం వస్తున్నప్పటికీ కోడెల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.  

వద్దన్నా తీసుకొస్తున్నారు..

రాజన్నకు భక్తులు కోడె మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా ఉండగా.. ఆలయానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరుల్లోనూ వీటిదే కీలకం. ఆలయానికి ప్రధానంగా రెండు గోశాలు ఉండగా కట్టకింద బస్టాండ్​లోని కోడెలను  టెంపుల్ లో భక్తులు తిప్పడానికి ఉపయోగిస్తుంటారు. అక్కడి వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు. రెండోది తిప్పాపూర్​ గోశాల. ఇందులో అనారోగ్యంగా ఉన్నవి, భక్తులు మొక్కులుగా చెల్లించే పాలుమరువని కోడెలు, జెర్సీలాంటివి ఉన్నాయి. వీటిని అధికారులు వద్దన్నా భక్తులు తీసుకురావడం సమస్యగా మారింది. 

ఒకవేళ ఆలయ అధికారులు తీసుకోకపోతే పరిసరాల్లో వదిలివేయడంతో చేసేది ఏం లేక వాటిని సైతం తిప్పాపూర్​ గోశాలకు తరలిస్తున్నారు. దీంతో  గోశాలలో చాలావరకు రోగాలు, చిన్న కోడెలు ఎక్కువగా మృతి చెందుతున్నాయి. కోడెల పంపిణీలో జిల్లా కలెక్టర్​ చైర్మన్​ గత 6 నెలల కింద గోశాలలో ఒక్క పాస్​బుక్​ ఉన్న రైతుకు రెండు చొప్పున పంపిణీ చేశారు. అదే సమయంలో వరంగల్ ​జిల్లాలో ఓ రైతు పేరుతో అధికంగా కోడెలు ఇవ్వడంతో పక్కదారి పట్టాయని విమర్శలు రావడంతో నిలిపివేశారు.  

గోశాలను సందర్శించిన కలెక్టర్

కోడెల మృతిపై మీడియాలో వార్తలు రావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్​ సందీప్​ కుమార్​ ఝా వెంటనే తిప్పాపూర్​లోని గోశాలను సందర్శించారు. కోడెలు ఉన్న షెడ్లలోకి వెళ్లి పరిశీలించారు. అక్కడ వెటర్నరీ సిబ్బంది  చికిత్సలు చేస్తున్నారు. అనారోగ్యం బారిన పడిన కోడెలను వేరుగా ఉంచి ట్రీట్ మెంట్ చేయించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. బురద నీటిని తొలగించేందుకు అవసరమైన మట్టి తెప్పించి పోయించాలని ఆలయ అధికారులకు సూచించారు. రూల్స్ మేరకు త్వరలోనే రైతులకు కోడెలను పంపిణీ చేస్తామన్నారు.  సోషల్​ మీడియాలో అసత్య ప్రచారాలు చేయొద్దని, నమ్మెద్దని కోరారు. 

ఇయ్యాల రాజన్న కోడె దూడల పంపిణీ

రాజన్న సిరిసిల్ల,వెలుగు: ఇయ్యాల అర్హులైన రైతులకు రాజన్న గోశాలలోని 300 కోడె దూడలను ఆదివారం  సాయంత్రం 3 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. పట్టాదారు పాస్ బుక్ కలిగిన అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న చిన్న కోడె దూడలను పంపిణీ చేస్తామన్నారు. అర్హులైన రైతులు పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు తదితర పత్రాలతో గోశాలకు రావాలని, కోడె దూడలను పొందిన రైతులు వాటిని సక్రమంగా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.

గోశాలలో పరిమితికి మించి కోడెలు 

రాజన్న ఆలయానికి సంబంధించిన తిప్పపూర్​గోశాలను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ అడిషనల్​కమిషనర్​శ్రీనివాస్‌రావు, డిప్యూటీ కమిషనర్​కృష్ణ ప్రసాద్‌ శనివారం పరిశీలించారు. గోశాలలో కోడెలకు అందిస్తున్న ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే.. గోశాలలో కోడెలు పరిమితికి మించి ఉన్నాయని, మ్యాన్ పవర్ పెంచాలన్నారు. సరైన వసతులు కల్పించడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోశాల పరిస్థితులపై దేవాదాయశాఖ కమిషనర్ కు  సమగ్ర నివేదిక సమర్పిస్తామని తెలిపారు. 

దేవాదాయ శాఖ అడిషనల్​ కమిషనర్​