హైదరాబాద్, వెలుగు: అఫర్డబుల్, హెల్దీ, హ్యాపి హౌసింగ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఇండ్లలో గాలి, సరైన వెంటిలేషన్, నీరు తగినన్ని అందుబాటులో ఉండేలా చూడాలని రియల్ ఎస్టేట్ రంగాల వారికి సూచించారు. సిటీలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) సిల్వర్ జూబ్లీ ఫౌండేషన్ డే సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం గురించి ప్రస్తావిస్తూ, ప్రకృతిని రక్షిస్తూనే రియల్ ఎస్టేట్ రంగాన్ని వృద్ధి చేసుకోవాలన్నారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రెరా చట్టాన్ని ఆమోదించినట్లు వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. ఆ చట్టం స్ఫూర్తిని అనుసరించాలన్నారు. హైదరాబాద్ ఇప్పుడు అత్యంత సేఫ్ సిటీ అని, పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు.