శంషాబాద్, వెలుగు: క్యాన్సర్, పలు వ్యాధులను అరికట్టడానికి మంచి ఆహారపు అలవాట్లు అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్టు, కేర్ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. క్యాన్సర్ తో తీవ్రమైన బాధతో పాటు ఆర్థికంగా కుటుంబాలు చితికిపోతున్నాయన్నారు.
మరోవైపు డయాబెటిస్ ప్రమాదకరస్థాయిలో పెరుగుతుందన్నారు. జంక్ ఫుడ్ మానుకోవాలని సూచించారు. చిరుధాన్యాల సాగు పెంచేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. వినికిడి లోపం ఉన్న నిరుపేద కుటుంబాల చిన్న పిల్లలకు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కేర్ ఆస్పత్రిలో శస్ర్తచికిత్స చేస్తున్నారన్నారు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. వైద్య పరీక్షలు చేయించుకున్నవారికి, రోగి సహాయకులకు స్వర్ణభారత్ ట్రస్టు నిర్వాహకులు ఉచితంగా భోజన సదుపాయం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, స్వర్ణభారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి శ్రీ బి.సుబ్బారెడ్డి, ప్రముఖ ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.