అమృత్సర్: సోషల్ మీడియా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు అని మరోసారి రుజువైంది. సోషల్ మీడియా ద్వారా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లొచ్చు. అంతేనా కష్టంలో ఉన్నవారిని ఆదుకోవచ్చు అని నెటిజన్లు నిరూపిస్తున్నారు. ఏదైనా ఎమోషనల్ కంటెంట్ కనపడితే చలించిపోయి తమకు తోచిన సాయం చేసేవాళ్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎందరో ఉన్నారు. తాజా ఓ బామ్మ వీడియోకు వచ్చిన స్పందనే దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది.
80 ఏండ్ల వయసులోనూ సొంత కష్టంతో..
వయసు మీద పడిన కొంత మందిలో ఏ మాత్రం పట్టుసడలిపోదు. అలా మనిషే పంజాబ్లోని అమృత్సర్కు చెందిన ఈ బామ్మ. ఆమె వయసు 80 ఏండ్లు పైనే. అయినా ఆమె మరొకరిపై ఆధారపడకుండా తన కష్టంతోనే జీవితం గడుపుతోంది. సొంతంగా జ్యూస్ బండి పెట్టుకుని, వచ్చే డబ్బులతో పొట్టపోసుకుంటోంది. ఈ బామ్మ ఇలా జ్యూస్ అమ్ముతున్న సీన్ను ట్రావెలర్ కమ్ ఫుడ్ బ్లాగర్ అయిన గౌరవ్ వాసన్ అనే యువకుడు తన కెమెరాతో షూట్ చేశాడు. దీనిని @youtubeswadofficial అనే తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశాడు. దీంతో వారం రోజుల్లోనే ఆ వీడియోకు దాదాపు కోటి వ్యూస్ వచ్చాయి. అలాగే 11 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
అడ్రస్తో మరో నెటిజన్ పోస్ట్
ఆ బామ్మ కష్టం చూసి చలించిపోయిన చాలా మంది నెటిజన్లు తాము సాయం చేస్తామంటూ కామెంట్లు చేశారు. అయితే ఆరిఫ్ షా అనే ఓ నెటిజన్ ఏకంగా ఆమె అడ్రస్ సంపాదించి సాయం చేయాలనుకునే వాళ్లు చేయొచ్చంటూ ఆ వీడియోను ట్వీట్ చేశాడు. ఆమె అమృత్సర్లోని రాణి డ బాగ్ ఏరియాలో ఎస్బీఐ ఎదురుగా తన జ్యూస్ బండితో ఉంటుందని పోస్ట్ పెట్టాడు. దీంతో చాలా మంది తాము సాయం చేస్తామంటూ కామెంట్లు పెట్టారు. కొందరు ఆమె బ్యాంకు అకౌంట్ వివరాలని చెప్పాలని కోరారు.గత ఏడాది ఢిల్లీలో బాబా కా ధాబా అనే పేరుతో చిన్న హోటల్ నడుపుతున్న వృద్ధ దంపతుల జంట కూడా ఇలాగే సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పాపులర్ కావడం, ఆ తర్వాత వారికి సాయం అందడం తెలిసిందే.
This 80 year old woman runs a stall in Amritsar. She is working hard in her old age to feed herself. She's struggling to have customers from sometime. Her stall is located at Rani Da Bagh, near Uppal Neuro Hospital. Please visit her stall, help her so that she can earn some money pic.twitter.com/RTTTakRT9q
— Aarif Shah (@aarifshaah) July 28, 2021