- న్యూ ఇయర్ పార్టీలు జరిగే ప్రాంతాలపై ఫోకస్
- పబ్బులు, హోటల్స్, ఫామ్హౌస్లలో తనిఖీలు
హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఈగల్ ఫోర్స్ అప్రమత్తమయ్యింది. హైదరాబాద్లోని పబ్బులు,ఈవెంట్లు జరిగే హోటల్స్, ఫామ్హౌస్లలో జరిగే పార్టీలకు డ్రగ్స్, గంజాయి సప్లయ్ అవుతున్నదనే సమాచారంతో నిఘా పెంచింది. 150 మందితో కూడిన స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసింది. ఈగల్ ఎస్పీ సీతారాం సోమవారం మీడియా సమావేశం నిర్వహించి స్పెషల్ ఆపరేషన్ల వివరాలు వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లు చేయనున్నామని తెలిపారు. అనుమానిత ప్రాంతాలతో పాటు గతంలో చిక్కిన డ్రగ్ సప్లయర్లు, కస్టమర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా డెకాయ్ ఆపరేషన్లు చేపడతామన్నారు. ఈవెంట్లలో అనుమానితులకు యూరిన్, సలైవా టెస్టులు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డీజేలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు.
‘‘గత10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదు చేశాం. ఈ కేసులతో సంబంధం ఉన్న 27 మంది డ్రగ్ పెడ్లర్లు, 17 మంది వినియోగదారులు, ఐదుగురు విదేశీ మహిళా నిందితులను అదుపులోకి తీసుకున్నాం. 68 గ్రాముల కొకైన్, 50.5 గ్రాముల ఎండీఎంఏ , 2 గ్రాముల ఎల్ఎస్డీ బ్లాట్స్, 381.93 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం” అని సీతారం వివరించారు. డ్రగ్స్ సరఫరా, వాడకంపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్, ఏజెన్సీ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్న గంజాయిపైనా పటిష్టమైన నిఘా పెట్టామని వెల్లడించారు.
