అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో మాజీ సీఎం

అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో మాజీ సీఎం

గాంధీనగర్: గుజరాత్‏లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‎లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నాం విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. 

ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే ఎయిర్ పోర్టు సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది. ప్రమాదానికి గురైన విమానంలో బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. ఈ విమానంలోనే ఆయన లండన్ వెళ్తున్నారు. విమానంలో ప్రయాణించే ప్యాసింజర్ల జాబితా విడుదలైన తర్వాత ఈ విషయం స్పష్టమైంది. 

Also Read : రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోడీ ఫోన్.. హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరిన కేంద్రమంత్రి

విమాన ప్రమాదం తర్వాత విజయ్ రూపానీ టికెట్, బోర్డింగ్ పాస్ వైరల్‎గా మారాయి. రూపానీ జూన్ 30న లండన్ నుంచి తిరిగి రావాల్సి ఉంది. ఇంతలో ఆయన ప్రయాణిస్తోన్న విమానం ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 110 మంది  మృతి చెందినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

మృతుల సంఖ్య గురించి అధికారులు ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఘటన స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరారు.