రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోడీ ఫోన్.. హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరిన కేంద్రమంత్రి

రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోడీ ఫోన్.. హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరిన కేంద్రమంత్రి

గాంధీనగర్: గుజరాత్‎లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‎లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానశ్రయం సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.

ప్రమాదంపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని.. సహయక బృందాలు ఇప్పటికే ఘటన స్థలంలో ఉన్నాయని తెలిపారు. డీజీసీఏ, ఎయిర్ ఇండియా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. విమాన ప్రమాదం నేపథ్యంలో మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి వెంటనే అహ్మదాబాద్ బయలుదేరారు. ముందస్తు షెడ్యూల్‎లోని అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని హుటాహుటిన పయనమయ్యారు.

Also Read : ఆ 5 నిమిషాల్లో ఏం జరిగింది:విమాన ప్రమాదానికి కారణాలు ఇవే..!

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటన స్థలానికి స్వయంగా వెళుతున్నట్లు రామ్మోహన్ నాయుడు మోడీకి చెప్పారు. అన్ని రకాల సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారం తనకు పంపాలని రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోడీ సూచించారు.

భారతదేశంలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదాల్లో ఇది ఒకటి. గుజరాత్ రాష్ట్రం.. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు అతి సమీపంలోని మేఘాని అనే కాలనీలో.. ఇళ్లపై కూలిపోయింది విమానం. 

>>> ఎయిర్ ఇండియా విమానం నెంబర్ AI 171. బోయింగ్ 787 మోడల్ ఫ్లయిట్ ఇది. 
>>> విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతుంది.
>>> విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12 మంది విమాన సిబ్బంది. 
>>> అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 2025, జూన్ 12వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాల సమయంలో బయలుదేరినట్లు సమాచారం. 
>>> ఎయిర్ పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే.. ఎయిర్ పోర్ట్ సమీపంలోని మేఘాని అనే కాలనీపై కుప్పకూలిపోయింది.