
- ఇండియన్ అమెరికన్లు తరలిరావాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: వికసిత్ భారత్ రన్తో మన భారతీయ ఐక్యత, ప్రగతిని చాటేందుకు భారతీయులంతా కలిసి రావాలని న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు ఆలయం (సాయి దత్త పీఠం) పిలుపునిచ్చింది. భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిదని, జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశం వచ్చిందని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
భారతీయ అమెరికన్ కమ్యూనిటీ, న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ మద్దతుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆదివారం ఉదయం 9 గంటలకు 1665 ఓక్ట్రీ రోడ్, ఎడిసన్, న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు ఆలయ పార్కింగ్ స్థలం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.
మన మాతృభూమి సాధించిన అద్భుత ప్రగతిని, ముఖ్యంగా 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశం సాగిస్తున్న చారిత్రక ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ పరుగులో ఇండియన్ అమెరికన్లు పాల్గొనాలని సాయిదత్త పీఠం కోరింది. భారత్, అమెరికా మైత్రిని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ రన్ ఒక వేదికగా మారనుంది. స్థానిక, జాతీయ ప్రవాస భారతీయ సంస్థలను కలుపుకొని సాయిదత్త పీఠం ఈ రన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.