
తమిళ హీరో విక్రమ్ ప్రభు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘ఘాటి’. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో అనుష్కతో అతను కలిసి నటించిన ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్రమ్ ప్రభు చెప్పిన విశేషాలు.
‘‘క్రిష్ చెప్పిన కథ నన్ను బాగా ఎక్సయిట్ చేసింది. ఆయన చాలా ఎక్స్పీరియెన్స్ ఉన్న డైరెక్టర్. నన్ను దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రంలోని ‘దేశిరాజు’ క్యారెక్టర్ రాశానని చెప్పారు. ఆ మాట నాకెంతో సంతోషాన్నిచ్చింది. ‘ఘాటి’ వరల్డ్ లో ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా ఉంటుంది.
ఇందులోని యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేస్తూ చేశా. మిగతా సినిమాల్లో కంటే ఇందులో ఫైట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో నా ఫేవరెట్ యాక్టర్ అనుష్క గారు ఉండడం ఇంకా హ్యాపీ. ఆమె ఎంత స్వీట్ పర్సనో అంతే పవర్ఫుల్ కూడా. తన కళ్లతోనే అన్ని హావభావాలూ పలికించగలరు. తనతో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియెన్స్.
ఆమెతో కలిసి నటించే ఛాన్స్ గతంలో ఒకసారి మిస్ అయింది. ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్ గారు చేసిన గోనగన్నారెడ్డి పాత్రను గుణశేఖర్ గారు ఫస్ట్ నాకే చెప్పారు. కానీ అప్పుడు నాకు కుదరలేదు. ఇన్నాళ్లకి అనుష్కతో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీ.
క్రిష్ గారి డైరెక్షన్లో పని చేయడం చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సీన్స్ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ప్రతి సీన్ కూడా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా తీశారు. నిర్మాతలకు ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి సినిమా తీయలేరు. తెలుగులో చిరంజీవి గారికి, నాగార్జున గారికి పెద్ద ఫ్యాన్ని. వాళ్ల సినిమాలు ఎన్నోసార్లు థియేటర్లో చూశా’’ అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.