పల్లెటూరోళ్లు బండ్లు కొంటలేరు.. టూవీలర్లు, ట్రాక్టర్లకు తగ్గిన గిరాకీ

పల్లెటూరోళ్లు బండ్లు కొంటలేరు.. టూవీలర్లు, ట్రాక్టర్లకు తగ్గిన గిరాకీ
  •     ఈసారి ఎండలు ఎక్కువ ఉండే చాన్స్​
  •     డిమాండ్ ఇంకా​ తగ్గొచ్చు

న్యూఢిల్లీ: 2023 ఆర్థిక సంవత్సరంలో పల్లెటూళ్ల నుంచి టూవీలర్లను, ట్రాక్టర్లను కొనేవారి సంఖ్య విపరీతంగా తగ్గింది.  టూవీలర్స్​ రిటైల్‌‌‌‌ అమ్మకాలు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.  ట్రాక్టర్లు అమ్మకాలు కూడా డల్​గానే ఉన్నాయని రిటైలర్లు చెబుతున్నారు. మిగతా బండ్ల కంటే ట్రాక్టర్ల సేల్స్​గ్రోత్​ చాలా తక్కువ ఉందని అంటున్నారు. ఇన్​ఫ్లేషన్​(ధరల పెరుగుదల) ఎఫెక్ట్​ గ్రామీణ భారతదేశంపై చాలా ఎక్కువగా ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) తెలిపింది.

ఇది మంగళవారం విడుదల చేసిన డేటా ప్రకారం టూవీలర్ల విభాగం వార్షిక ప్రాతిపదికన గ్రోత్​ని సాధించినప్పటికీ, అమ్మకాలు ఇప్పటికీ కరోనాకు ముందుస్థాయిలో లేవు. 2019కి ముందు సేల్స్​తో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో సేల్స్​ చాలా తక్కువగా ఉన్నాయి. “టూ-వీలర్ కేటగిరీ 12శాతం యానువల్​ గ్రోత్​ను సాధించింది. కరోనా ముందుస్థాయిల కంటే ఇది 9శాతం తక్కువగా  ఉంది.

పల్లెటూళ్ల నుంచి గిరాకీ లేదు.  అన్నింటి ధరలు పెరగడంతో బండ్లు కొనడానికి జనం వెనకాడుతున్నారు” అని ఫాడా ప్రెసిడెండ్​ మనీష్ రాజ్ సింఘానియా అన్నారు. ఇండియాలోని కొన్ని  ద్వీపకల్ప ప్రాంతాల్లో మినహా చాలాచోట్ల ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ ఎండలు ఉంటాయని  ఐఎండీ అంచనా వేసింది.

దీనివల్ల వ్యవసాయ పనులు తక్కువగా ఉంటాయి కాబట్టి  రాబోయే నెలల్లోనూ టూవీలర్ల,  ట్రాక్టర్ల వంటి బండ్ల అమ్మకాలూ తక్కువగానే ఉండొచ్చని ఎక్స్​పర్టులు అంటున్నారు. తక్కువ  సాగు ఆదాయాలు మొత్తం డిమాండ్‌‌‌‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. ఇదే ఏడాది జూలై, ఆగస్టు,  సెప్టెంబర్ ఎల్ నినో ప్రభావం కూడా ఉండొచ్చు. పసిఫిక్​ మహాసముద్రంలో ఒకరకమైన కాలానుగుణమైన మార్పును ఎల్​నినో అంటారు. దీనివల్ల చలికాలంలోనూ ఎండలు ఉంటాయి.

కరువులు వస్తాయి. గత 20 ఏళ్లలో వచ్చిన కరువులన్నింటికీ ఎల్​నినోయే కారణం. ‘‘దీనివల్ల  రుతుపవనాలు కూడా బలహీనంగా మారి వర్షాలు తగ్గుతాయి. దీంతో రూరల్​ ఇండియా గ్రోత్ దెబ్బతింటుంది. ఉత్తర,  మధ్య భారతదేశంలో అకాల వర్షాలు,  వడగళ్ల వానలు కీలకమైన రబీ పంటలను నాశనం చేశాయి.  పంట కోత ఆలస్యం అయింది.  గ్రామాల నుంచి డిమాండ్​ తగ్గడానికి ఇవన్నీ కారణమే”అని ఫాడా తెలిపింది.

రికార్డు లెవెల్​లో కార్ల అమ్మకాలు

2022 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో బండ్ల రిటైల్ అమ్మకాలు వార్షికంగా 14శాతం పెరిగాయి. ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాలు రెండంకెల గ్రోత్​ని సాధించాయి. టూవీలర్స్, త్రీవీలర్స్​, ప్యాసింజర్ వెహికల్స్​ (కార్లు), కమర్షియల్​ వెహికల్స్​ (సీవీలు) వరుసగా 12శాతం, 69శాతం, 14శాతం,  10శాతం గ్రోత్​ని సాధించగా, ట్రాక్టర్​ సెగ్మెంట్​ గ్రోత్​ మార్చిలో 4శాతానికి పరిమితమయింది.  2023 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇదే పోకడ కనిపించింది. ట్రాక్టర్ల విభాగం ఇతర విభాగాల కంటే వెనుకబడింది.  

2023 ఆర్థిక సంవత్సరంపై కరోనా ఎఫెక్ట్​ ఏమీ లేదు కాబట్టి రిటైల్ అమ్మకాలు 21శాతం  గ్రోత్​ని సాధించాయని  సింఘానియా చెప్పారు. టూవీలర్స్​, త్రీవీలర్స్​,  పీవీలు ,  సీవీలు  వరుసగా వరుసగా 19శాతం, 84శాతం, 23శాతం  33శాతం గ్రోత్​ని (పూర్తి ఆర్థిక సంవత్సరానికి)సాధించాయి. ట్రాక్టర్ల సెగ్మెంట్ వార్షిక ప్రాతిపదికన 8శాతం  గ్రోత్​ని సాధించింది.

కార్లు రికార్డుస్థాయిలో 36 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 సంవత్సరంలో అమ్మకాలు 32 లక్షల వరకు ఉన్నాయి.   ఎక్కువ బేస్, ధరల భారం,  ఖర్చులు పెరగడం, కొత్త రూల్స్​ రావడం వల్ల 2024 ఆర్థిక సంవత్సరంలో గ్రోత్​ తగ్గవచ్చని ఫాడా తెలిపింది.