- పేర్లలో మార్పులుండడంతో గ్రామస్థుల లొల్లి
- కొత్త లిస్ట్ తయారు చేయాలని డిమాండ్
- పెట్రోల్ పోసుకునేందుకు వార్డు మెంబర్ యత్నం
- వెనుదిరిగిన అధికారులు
దుబ్బాక, వెలుగు: డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవతవకలు జరిగాయని గురువారం చీకోడ్ గ్రామ పంచాయతీ ఆఫీసు ఎదుట గ్రామస్థులు ధర్నా చేశారు. ఆదివారం మంత్రి హరీశ్రావు ‘డబుల్’ ఇండ్లను ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం సర్పంచ్ తౌడ శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫస్ట్లిస్ట్లో ఉన్న పేర్లకు, సెకండ్ లిస్ట్ పేర్లకు తేడా ఉండడంతో గొడవ మొదలైంది. ఇండ్లు, భూములు, బండ్లు ఉన్నవాళ్లనే ఎంపిక చేశారని, ఆ రెండు లిస్టులు క్యాన్సిల్చేసి గ్రామ సభలోనే కొత్త లిస్ట్ తయారు చేయాలని డిమాండ్ చేశారు. పేర్లు రాని వారు కూడా లొల్లికి దిగారు. ఇది కాస్తా ఎంపికైన లబ్ధిదారులు, పేర్లు లేని వారి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఆఫీసర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు ఎంత సముదాయించిన అక్కడున్న వారు వినలేదు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ జోక్యం చేసుకుని 100 ఇండ్లు శాంక్షన్ అయితే 65 కట్టారని, మిగిలిన 35 ఇండ్లు కట్టాక రాని వారికి కూడా ఇస్తామన్నారు. మంత్రి వస్తున్నాడు కాబట్టి డిస్టర్బ్ చేయవద్దని కోరారు. అయినా అర్హులకే ఇవ్వాలని పట్టుబట్టడంతో గ్రామ పంచాయతీ రూమ్లోకి వెళ్లిపోయారు. ఇంతలోనే10వ వార్డు మెంబర్ కొమిరె నరేశ్ తాను నిరుపేదనని, తనకు డబుల్ బెడ్రూమ్రాలేదని, తన వార్డులో అర్హులైన వారి పేర్లు కూడా లేవని ఒంటిపై పెట్రోల్ పోసుకోబోయాడు. దీన్నిచూసిన ఎంపీటీసీ లచ్చమ్మగారి రాంరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ పెనుగులాటలో అక్కడున్నవారిపై పెట్రోల్పడడంతో ఎటోళ్లటు పరుగులు తీశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదంతా చూసి ఆఫీసర్లు వెళ్లిపోయారు. కాగా, వార్డ్ మెంబర్ నరేశ్ తమపైనే పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడని సర్పంచ్ శ్రీనివాస్ పీఎస్లో కంప్లయింట్ ఇచ్చాడు.