హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉత్తరాంధ్ర, తెలంగాణ రాజధాని ప్రాంతాల మధ్యప్రయాణించే వారికి రైల్వే శాఖ తీపి కబురు అందించింది. ఇప్పటివరకు స్పెషల్ ట్రైన్గా సేవలందిస్తున్న విశాఖపట్నం -చర్లపల్లి ఎక్సెప్రెస్సు ఏప్రిల్ నుంచి రెగ్యులర్ సర్వీస్ గా నడిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంతో ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. దక్షిణ మధ్య రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. ఈ రైలు ఇకపై వారానికి ఒకసారి రెగ్యులర్ సర్వీస్ గా నడవనుంది. ట్రైన్ నం. 18527 విశాఖపట్నం - చర్ల పల్లి ఎక్స్ప్రెస్ ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది.
ట్రైన్ నం. 18528 చర్లపల్లి-విశాఖపట్నం ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రతి శనివారం నడవనుంది. హైదరాబాద్లోని ప్రధాన స్టేషన్లపై రద్దీని తగ్గించే ఉద్దేశంతో అభివృద్ధి చేసిన చర్లపల్లి టెర్మినల్ నుంచి ఈ సర్వీసు నడపడం వల్ల సిటీ నలుమూలల వారికి ప్రయాణం సులభతరం కానుంది.
