విశాఖ బీచ్ లో రెండో రోజే కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి : తప్పిన పెను ప్రమాదం

విశాఖ బీచ్ లో రెండో రోజే కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి : తప్పిన పెను ప్రమాదం

విశాఖ ఆర్​కే బీచ్​ లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది.  నిన్న ( ఫిబ్రవరి 25) ఎంతో అట్టహాసంగా ఫ్లోటింగ్​ బ్రిడ్జిని రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి...మంత్రి గుడివాడ అమర్​ నాథ్​ ప్రారంభించారు.  విశాఖకు మణిహారం అని చెప్పి ప్రారంభించిన రెండో రోజే  సముద్రంలో కొట్టుకుపోయింది.  అయితే ఆ సమయంలో బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.   ఫ్లోటింగ్​ బ్రిడ్జి చివరి భాగం 100 మీటర్లు సముద్రంలో కొట్టుకుపోయింది.   దీంతో ఆర్కే బీచ్ అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులు భయపడిపోయారు. ఘటన జరిగిన సమయంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి మీద ఎవరూ లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.సరదాగా అలా సముద్రంపై నడక సాగిద్దామనుకుంటే ఇప్పుడు భయం వేస్తోందని చెప్తున్నారు. ఆర్కే బీచ్‌కు వచ్చిన సందర్శకులు సైతం దీనిపై మండిపడ్డారు.

విశాఖ మెట్రోపాలిటన్ రీజయన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేప‌ట్టింది. జనవరి మొదటి వారంలో ఈ పనులు చేపట్టి వేగంగా పూర్తిచేసింది.  ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని సుమారు కోటీ 60 లక్షల వ్యయంతో నిర్మించారు. ప్రారంభించిన రెండో రోజే.. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోవటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఆర్కే బీచ్‌లో అలల తీవ్రత ఎక్కువని, తేలియాడే ఫ్లోటింగ్ బ్రిడ్జిలు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు దారితీయవచ్చనే అనుమానాలు, ఆందోళనలు బ్రిడ్జి నిర్మాణ సమయంలోనే నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  హడావుడిగా ఏర్పాటు చేయాలన్న తపనే తప్ప..భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.అయితే ప్రారంభించిన రెండో రోజే ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు.