
మిషన్ భగీరథ ప్రాజెక్ట్ వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ధర్మపురి నియోజకవర్గ బీజేపీ మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి కేసీఆర్ నెట్టాడని ఆరోపించారు.
తన తండ్రి హాయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 33 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో 12 వేల కోట్లు ఖర్చు పెట్టి సంగం పనులు పూర్తి చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు చెప్పి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క చుక్క నీరు రావడం లేదన్నారు. మేఘా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చి ప్రపంచంలోనే ధనికుడిను చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు.
రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు, బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టిన భయపడవద్దని, వారికి తాను భరోసాగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
మునుగోడు ఎలక్షన్ టైమ్ లో అధికార పార్టీ తన ఫ్యాక్టరీ మూసివేసి ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. ఇప్పటికీ తనను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టిన,ఎన్ని ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వంతో కొట్లాడి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలని
సూచించారు.