వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలె

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలె

పెద్దపల్లి జిల్లా : ధర్మారం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సంఘీభావం తెలిపారు. వీఆర్ఏలకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ తప్పారంటూ మండిపడ్డారు. వీఆర్ఏలకు పదోన్నతలు కల్పించాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఇప్పటి వరకూ వీఆర్ఏలను ఎందుకు పర్మినెంట్ చేయలేదని ప్రశ్నించారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్.. ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

రాష్ర్ట ప్రజలను మర్చిపోయిన కేసీఆర్.. కేవలం తన గురించి, తన కుటుంబ సభ్యుల గురించే మాత్రమే ఆలోచిస్తున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. వీఆర్ఏల సమస్యలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు గౌరవ వేతనం వద్దని, పే స్కేలు ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. సీఎం ఎప్పుడు అబద్దాలు మాట్లాడుతుంటారని, ఆ తర్వాత వాటిని కూడా మర్చిపోతుంటారని కామెంట్స్ చేశారు. 

అంతకుముందు.. వెల్గటూర్ మండలం ఎల్లంపల్లి ముంపు గ్రామం చెగ్యాం భూ నిర్వాసితులను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. నూతన ఆర్ అండ్ ఆర్ కాలనీ గవర్నమెంట్ స్కూల్ లో ఉన్న ముంపు బాధితులతో మాట్లాడిన వివేక్... వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ముంపు గ్రామస్తుల సమస్యలు పరిష్కరించాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. పది సంవత్సరాలుగా ముంపు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పరిహారం అందించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని జగిత్యాల కలెక్టర్ ను ప్రశ్నించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు లో ఐదు గ్రామాలను 30 పర్సెంట్ మాత్రమే ముంపు గ్రామాలుగా ప్రకటించారని వివేక్ వెంకటస్వామి అన్నారు. దానిని 100 పర్సెంట్ ముంపు గ్రామాలుగా ప్రకటించాలని అప్పటి ప్రభుత్వంపై  తాను ఒత్తిడి తీసుకువచ్చానని గుర్తు చేశారు. 

135 కుటుంబాలను ఈ వరద కష్టకాలంలో ఆదుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. వరదలు వచ్చి ఇండ్లు కూలిపోయి బాధలో ఉంటే బాధితులను రోడ్డుపై పడేయటమేంటని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్నపుడు వచ్చిన నష్ట పరిహారమే తప్ప ఇప్పటివరకు బాధితులకు ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నష్ట పరిహారం అందించకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.