భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించండి

 భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించండి

భూ నిర్వాసితులపై దాడి చేయడాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి  ఖండించారు. నిర్వాసితులకు న్యాయం చేయకపోగా..దాడి చేయడం సిగ్గుచేటన్నారు. నిర్వాసితులకు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిర్వాసితులకు రావాల్సిన పరిహారాన్నిన వెంటనే చెల్లించాలిని డిమాండ్ చేశారు.

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది. రెండు మూడ్రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు రెడీ అయ్యింది సర్కార్. అయితే ట్రయల్ రన్ ను భూనిర్వాసితులు అడ్డుకుంటారనే ఉద్దేశంతో ముందస్తుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే వంద మందిని అరెస్ట్ చేసి.. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రాజెక్టు కోసం కాలువ పనుల సర్వే జరుగుతుండటంతో అటు వైపుగా నిర్వాసితులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

భూ నిర్వాసితులను అరెస్ట్ చేసే టైంలో పోలీసులకు... గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ముందస్తు అరెస్టులను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో భూ నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు భూనిర్వాసితులకు గాయాలు అయ్యాయి. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మీడియాను కూడా అనుమతించడం  లేదు.