ఇది ప్రజల విజయం.. చెన్నూరును మోడల్ నియోజకవర్గంగా మారుస్త : ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

ఇది ప్రజల విజయం.. చెన్నూరును మోడల్ నియోజకవర్గంగా మారుస్త : ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి
  •    ఉద్యోగాలు, తాగునీళ్లు, రోడ్ల సౌలత్​లకు కృషి చేస్తా
  •     సొంత ప్రయోజనాల కోసం పనిచేయడంతోనే కేసీఆర్ ను ఓడించారు
  •     బాల్క సుమన్ కు ఓటర్లు సరైన జవాబు ఇచ్చారు
  •     కాంగ్రెస్​ సర్కార్..​ రోల్​మోడల్​గా పని చేస్తుందని వెల్లడి

కోల్​బెల్ట్, వెలుగు : ‘‘నా గెలుపు కోసం ప్రజలు, కాంగ్రెస్​ శ్రేణులు ఎంతో కృషి చేశారు. ఇది చెన్నూరు ప్రజల విజయం” అని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి అన్నారు. తాను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించానని, చెన్నూరు ప్రజల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేశానని ఆయన చెప్పారు. ఆదివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ఐజా ఇంజినీరింగ్​ కాలేజ్​వద్ద ఎన్నికల కౌంటింగ్​ అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడారు. తన తండ్రి కాకా వెంకటస్వామి సేవలు, తమ కుటుంబంపై ఈ ప్రాంత ప్రజలు చూపిన ప్రేమ తన విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు.

సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లినప్పుడు కాకా వెంకటస్వామి సంస్థ.. లక్ష మంది సింగరేణి ఉద్యోగులను కాపాడిందన్నారు. జైపూర్​లో పవర్​ ప్లాంట్​ తీసుకువచ్చిన ఘనత కాకాకు దక్కుతుందని గుర్తుచేశారు. ‘‘రామగుండంలో ఎరువుల కర్మాగారం రీ ఓపెన్​ చేయించాం. మా ఫౌండేషన్​ ద్వారా ఈ ప్రాంతంలో వేల బోర్లు వేయించాం. స్కూళ్లకు బెంచీలు అందజేశాం. టీచర్లను ఏర్పాటు చేసి సేవలు అందించాం.

కాకా వెంకటస్వామి, మా కుటుంబం అందించిన సేవలను ప్రజలు గుర్తించి నన్ను చెన్నూరు నుంచి, నా అన్న గడ్డం వినోద్​ను బెల్లంపల్లి నుంచి భారీ మోజారిటీతో గెలిపించారు. ప్రజలు మమ్మల్ని తమ మనిషిగా గుర్తించారు. చెన్నూరు నియోజకవర్గాన్ని మోడల్​ నియోజకవర్గంగా తీర్చిదిద్ది ప్రజల రుణం తీర్చుకుంటా. ఉద్యోగాల కల్పన, తాగునీళ్లు, రోడ్ల సౌలత్​లు కల్పించేందుకు కృషి చేస్తా” అని వివేక్  తెలిపారు. గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్​ ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను  అందించిందని, అందువల్లే ప్రజలు మరోసారి కాంగ్రెస్​కు పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు.

వివేక్​కు కర్నాటక మంత్రి కంగ్రాట్స్

చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేక్​ వెంకటస్వామిని కర్నాటక సివిల్ సప్లయ్​ శాఖ మంత్రి మునియప్ప అభినందించారు. కౌంటింగ్​ కేంద్రానికి వచ్చిన మునియప్ప.. వివేక్​ను కలిశారు. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్​ వెంకటస్వామికి రిటర్నింగ్​ అధికారి సిడాం దత్తు అధికారికంగా సర్టిఫికెట్​ను అందించి అభినందించారు. తన భార్య సరోజ, తనయుడు గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్​ లీడర్లతో కలిసి వివేక్.. రిటర్నింగ్​ అధికారిని కలిశారు. 

ఉల్లాసంగా గడిపిన గడ్డం సోదరులు

చెన్నూరు నుంచి గడ్డం వివేక్​ వెంకటస్వామి, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్​ విజయం సాధించడం కాంగ్రెస్​ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. వివేక్​ వెంకటస్వామి, వినోద్​ సోదరులు చాలా సేపు కౌంటింగ్​ కేంద్రం ఆవరణలో కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలతో కలిసి సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు.

కేసీఆర్ ​పాలనతో ప్రజలు విసిగిపోయారు

మాజీ సీఎం కేసీఆర్​ కుటుంబ, అవినీతి, రాక్షస పాలనను అడ్డుకోవడానికి తాను నిరంతరం పోరాటం చేశానని వివేక్  వెంకటస్వామి తెలిపారు. కేసీఆర్​ తన సొంత ప్రయోజనాల కోసమే పనిచేయడంతో ప్రజలు విసిగెత్తిపోయారని, అందువల్లే ఆయనను ఓడించారని చెప్పారు. తెలంగాణ వచ్చినా తమ బతుకులు బాగుపడలేదని, కేసీఆర్​  కుటుంబానికే ఫలాలు దక్కాయని ప్రజలు గమనించి, ఈసారి బీఆర్ఎస్​కు గట్టి బుద్ధి చెప్పారని వెల్లడించారు. కాంగ్రెస్​ సర్కార్..​ రోల్​మోడల్​ ప్రభుత్వంగా ఉంటుందన్నారు.

తమ పార్టీ నేత రాహుల్​ గాంధీ భారత్​జోడో యాత్ర తరువాత దేశ ప్రజలు కాంగ్రెస్​ వైపు చూస్తున్నారని, రేవంత్​రెడ్డి కాంగ్రెస్​ శ్రేణులను ఒక తాటిపైకి తీసుకువచ్చి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారని కొనియాడారు. ‘‘దమ్ము, ధైర్యం ఉంటే చెన్నూరులో నిలబడు వివేక్’’​ అంటూ బాల్క సుమన్​ విసిరిన సవాల్​కు ఓటర్లు తనను గెలిపించి సుమన్ కు తగిన జవాబు చెప్పారని వివేక్  వ్యాఖ్యానించారు.