
- మాల, మాదిగలు ఏకతాటిపై ఉంటేనే రిజర్వేషన్లు, నిధులు: వివేక్ వెంకటస్వామి
- చాలా రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్లు పెంచారు.. తెలంగాణలో కూడా అదేవిధంగా చేయాలి
- మాలలంతా ఐక్యంగా ఉండాలి
- మాలల ఆత్మీయ సమ్మేళనంలో చెన్నూరు ఎమ్మెల్యే
కరీంనగర్, వెలుగు: మాల, మాదిగలు ఏకతాటిపై ఉంటేనే రిజర్వేషన్లు, నిధులు పెరుగుతాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ పెట్టినప్పుడు తాను, ఎమ్మెల్యే నాగరాజు ఎస్సీలకు రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశామని గుర్తుచేశారు. బుధవారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళనానికి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘ఎస్సీల రిజర్వేషన్లను 25 శాతానికి పెంచాలని నేను అసెంబ్లీలో చెప్పాను. చాలా రాష్ట్రాల్లో 20 శాతం వరకు పెంచారు. మాల, మాదిగలు ఎప్పుడూ కొట్లాడుతుంటేనే మనం ముందుకు పోవచ్చనే ఆలోచనతో కొంతమంది రాజకీయ నాయకులు, ఇతర వర్గాల నేతలు ఉన్నారు. ఎస్సీల రిజర్వేషన్లు పెంచాలని దళిత ఎమ్మెల్యేలు సైతం కొట్లాడటం లేదు. బడ్జెట్లో మనకు హక్కుగా రావాల్సిన నిధులు రాకున్నా అడుగుతలేరు. ఎస్సీలకు ఎక్కువ నిధులు, ఎక్కువ రిజర్వేషన్లు వస్తే ఎవ్వరికీ కూడా అన్యాయం జరగదు కదా!’’అని వివేక్ అన్నారు. తమిళనాడు, హర్యానా, పంజాబ్లో పెంచినట్లు ఎందుకు తెలంగాణలో పెంచడం లేదని ప్రశ్నించారు.
మాలలు ఐక్యంగా ఉండాలి..
మాలలు ఐక్యంగా లేకపోతే అన్యాయానికి గురవుతారని, పోరాడితేనే జాతి మనుగడ ఉంటుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. గతేడాది డిసెంబర్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సింహ గర్జన సభతో మాలల సత్తా చాటామని, మనమంతా ఒక్క మాట మీద నిలబడ్డామనే సందేశం ఇచ్చామని గుర్తుచేశారు. అణచివేస్తే వెనక్కి తగ్గొద్దని.. ఫైట్ చేయాలని తన తండ్రి కాకా వెంకటస్వామి చెప్తుండేవారని, అదే స్ఫూర్తితో తాను అప్పుడు తెలంగాణ కోసం, ఇప్పుడు జాతి కోసం నిలబడ్డానన్నారు. గతంలో మాలలను అన్ని రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తుండేవని, కానీ తాము ఐక్యంగా ఉన్న విషయాన్ని డిసెంబర్ సభతో చాటిచెప్పామన్నారు. ఆ మీటింగ్కు ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి తాను దేశంలోనే ఇంత పెద్ద కాస్ట్ మీటింగ్ చూడలేదని చెప్పారని గుర్తుచేశారు. తన పొలిటికల్ కెరీర్ రిస్క్లో పడుతుందని తెలిసినా తన జాతి కోసం నిలబడక తప్పలేదన్నారు.
ప్రొటోకాల్ విషయంలో మాలమాదిగల గొడవెక్కడిది?
కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాల్లో తన కొడుకు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో ప్రొటోకాల్ పాటించలేదని వివేక్ వెంకటస్వామి గుర్తుచేశారు. ‘‘అధికారులు ఎంపీకి ప్రొటోకాల్ ఇవ్వలేదు. దీనిని సరిదిద్దుకుంటే సరిపోయేది. కానీ తప్పే జరగనట్లు ప్రవర్తించారు. చాలా మంది దళిత సంఘాల నాయకులు కూడా ఇదే అన్నారు. ఎందుకు మీరు ప్రొటోకాల్ ఫాలో కావడం లేదని ప్రశ్నించారు. కానీ ఒక వ్యక్తి కావాలని ఎమ్మార్పీఎస్ వాళ్లతో స్టేట్మెంట్ ఇప్పించాడు. ఇందులో మాల, మాదిగ గొడవే లేదు. కానీ కావాలని మాల మాదిగ గొడవగా మార్చి దళితులను వెనక్కినెట్టే కుట్రలు చేశారు. మన సత్తా మనం సరిగా చూపించుకోకపోతే మనకు ఎప్పుడూ ఇలాంటి అన్యాయమే జరుగుతుంది’’అని ఆయన అన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో చదువుకోవాలి..
బాబా సాహేబ్ బీఆర్ అంబేద్కర్ 23 డిగ్రీలు సాధించారని, ఆయన స్ఫూర్తితో స్టూడెంట్లు చదువుకోవాలని వివేక్ సూచించారు. తన తండ్రి కాకా స్థాపించిన అంబేద్కర్ కాలేజీలో కార్పొరేట్ స్థాయి వసతులు ఉన్నాయని, అందులో 6 వేల మంది చదువుకుంటున్నారని తెలిపారు. మాలమాదిగ గొడవల్లో మనందరిని బలహీనం చేయడానికి కొందరు ప్రయత్నిస్తుంటారని, అలాంటి కుట్రలను తిప్పికొట్టాలన్నారు. అనంతరం మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దాసరి బాబు, బత్తుల నరేష్, రెంజర్ల రాజేశ్తో పాటు పలువురిని వివేక్ వెంకటస్వామి అభినందించారు. అంతకు ముందు మెట్పల్లికి వచ్చిన ఎమ్మెల్యే వివేక్ను కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నియోజకవర్గ మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.