కేసీఆర్ మాటలు నమ్మి, మళ్లా ఓటేస్తే గోసపడ్తం:వివేెక్ వెంకటస్వామి

కేసీఆర్ మాటలు నమ్మి, మళ్లా ఓటేస్తే గోసపడ్తం:వివేెక్ వెంకటస్వామి

నాగర్ కర్నూల్, వెలుగు: సీఎం కేసీఆర్ మాటలు నమ్మి, మళ్లా ఓటేస్తే గోసపడ్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘ఎలక్షన్లు వస్తున్నాయంటేనే కేసీఆర్ బయటకు వస్తారు. పాత హామీల జోలికి పోకుండా కొత్త ముచ్చట చెప్తారు. మోసపోయి ఓట్లేస్తే మళ్లీ  ఐదేండ్లు గోసపడ్తాం. వచ్చే ఎన్నికల్లో కారును పంక్చర్ చేయాలి. డబుల్ ఇంజన్​ సర్కార్ తెచ్చుకోవాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లిలో ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ కార్నర్ మీటింగ్​లో వివేక్ మాట్లాడారు. ‘‘ఇంటికొక ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్.. తన కొడుకు, బిడ్డ, అల్లుడు, సడ్డకుని కొడుకుకు తలా ఒక ఉద్యోగం ఇచ్చి నెలకు రూ.25 లక్షల జీతం ఇస్తున్నారు. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని చెప్పి.. బుల్లెట్ ప్రూఫ్ గోడలున్న 100 బెడ్ రూమ్స్ తో  ప్రగతి భవన్ కట్టుకున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో 20 వేల ఎకరాలు సంపాదించిన కేసీఆర్.. పేదలకు గజం భూమి కూడా పంచలేదు. వేల ఎకరాల్లో ఆయన కొడుకు, బిడ్డ ఫామ్​ హౌస్​లు కట్టుకున్నారు” అని మండిపడ్డారు. పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం నిధులిస్తే, వాటిని కమీషన్ల కోసం ప్రాజెక్టులకు డైవర్ట్ చేశారని ఆరోపించారు.