అత్యవసర సేవల కోసం ఆపదమిత్రలు..యాక్సిడెంట్స్‌‌, ఎమర్జెన్సీ టైంలో  సేవలు అందించేలా యువతకు ట్రైనింగ్‌‌

అత్యవసర సేవల కోసం ఆపదమిత్రలు..యాక్సిడెంట్స్‌‌, ఎమర్జెన్సీ టైంలో  సేవలు అందించేలా యువతకు ట్రైనింగ్‌‌
  • ఒక్కో జిల్లాలో 300 మంది వలంటీర్ల ఎంపిక
  • నేషనల్, స్టేట్‌‌ డిజాస్టర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ అథారిటీ ఆధ్వర్యంలో శిక్షణ
  • ఫస్ట్ రెస్పాండర్స్‌‌, సెకండ్‌‌ లైన్‌‌ వారియర్స్‌‌గా వాడుకునేలా చర్యలు

హనుమకొండ, వెలుగు : సాధారణంగా అగ్నిప్రమాదాలు, యాక్సిడెంట్లు, వరదలు, ఇతర ఘటనలు జరిగినప్పుడు బాధితులకు సాయం చేయాలని స్థానిక యువత ప్రయత్నించినా ఏం చేయాలో.. ఎలా చేయాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. చివరకు అంబులెన్స్‌‌కో, పోలీసులకో, ఫైర్‌‌ సిబ్బందికో సమాచారం ఇచ్చినా.. వారు ఘటనాస్థలానికి చేరుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలాంటి ఇబ్బందులు ఇకపై తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ‘ఆపద మిత్ర’లుగా ఫస్ట్‌‌ రెస్పాండర్స్‌‌గా తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా లక్ష మంది ఆపద మిత్ర వలంటీర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. జిల్లాల్లో ఇప్పటికే యువతను సెలెక్ట్‌‌ చేసి ట్రైనింగ్‌‌ సెంటర్లు సైతం నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వీరు ఫస్ట్‌‌ రెస్పాండర్స్‌‌గా, సెకండ్‌‌ లైన్‌‌ వారియర్స్‌‌గా సేవలు అందించనున్నారు.

ఫస్ట్ రెస్పాండర్స్ వీళ్లే...

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాకుండా రోడ్డు యాక్సిడెంట్లు, పాముకాట్లు, ఫుడ్‌‌పాయిజన్‌‌ కేసులు, ఇతర మెడికల్‌‌ ఎమర్జెన్సీ సమయంలోనూ సరైన టైంలో స్పందించకపోతే  ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆపద మిత్ర వలంటీర్లు కీలకంగా వ్యవహరించనున్నారు. క్షేత్రస్థాయిలో ఉండే వలంటీర్లు తమ చుట్టూ ఏదైనా విపత్తు జరిగిన టైంలో ఫస్ట్‌‌ రెస్పాండర్స్‌‌గా వీళ్లే స్పందించాలి.

ఘటనాస్థలంలో ఉన్న పరిస్థితులు, అవకాశాన్ని బట్టి ప్రమాదంలో ఉన్న వ్యక్తులను హాస్పిటల్స్‌‌కు తరలించడం గానీ, అక్కడే ప్రాథమిక చర్యలు చేపట్టండ గానీ చేయడంతో పాటు సాయం కోసం రెస్క్యూ సిబ్బంది, ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలి. ఇక వరదలు, అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రెస్క్యూ టీమ్స్‌‌ ఫ్రంట్‌‌ లైన్‌‌లో సేవలు అందిస్తుంటే.. ఆపద మిత్ర వలంటీర్లు సెకండ్‌‌ లైన్‌‌ వారియర్స్‌‌గా సాయం అందించాల్సి ఉంటుంది.

ఒక్కో జిల్లాకు 300 మంది

దేశవ్యాప్తంగా లక్ష మంది ‘ఆపద మిత్ర’ వలంటీర్లను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌‌గా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఎన్‌‌డీఎంఏ, ఎస్‌‌డీఎంఏ ఆధ్వర్యంలో తెలంగాణలోని ఒక్కో జిల్లా నుంచి 300 మంది వలంటీర్లను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌‌ జిల్లాల్లో వలంటీర్లను ఎంపిక చేసి ‘ఆపద మిత్ర’ టైనింగ్ పూర్తి చేశారు. తాజాగా హనుమకొండ జిల్లాలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం, పరకాల మున్సిపాలిటీలో దాదాపు 280 మందికి ట్రైనింగ్‌‌ మొదలు పెట్టారు. ట్రైనింగ్‌‌ సమయంలో వలంటీర్లకు రోజుకు రూ.300 చొప్పున స్టైఫండ్‌‌ చెల్లించడంతో పాటు వసతి సదుపాయం కూడా కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ ఈ శిక్షణ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

గుర్తింపు కార్డులు ఇస్తం 

జిల్లా వ్యాప్తంగా 300 మంది ఆపద మిత్ర వలంటీర్లను తయారు చేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు జిల్లాలో మెప్మా, రాజీవ్‌‌ యువకేంద్రం ఆధ్వర్యంలో రెండు చోట్లా ఆపద మిత్ర వలంటీర్లకు ట్రైనింగ్‌‌ ఇస్తున్నాం. శిక్షణ పూర్తయిన తర్వాత వలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తాం. వలంటీర్లు, ఆఫీసర్లు అనుసంధానంగా పనిచేసేలా తగిన చర్యలు తీసుకుంటాం.- నాగరాజు, డిస్ట్రిక్ట్ ఫైర్‌‌ ఆఫీసర్‌‌, హనుమకొండ

ఎమర్జెన్సీ సర్వీసులతో  కోఆర్డినేషన్ 

అత్యవసర పరిస్థితుల్లో ఎలా రెస్పాండ్‌‌ కావాలో వలంటీర్లకు ట్రైనింగ్‌‌ ఇస్తున్నాం. శిక్షణ అనంతరం వలంటీర్ల వివరాలు, ఫోన్‌‌ నంబర్‌‌, ఇతర వివరాలను ఎమర్జెన్సీ సర్వీసులతో అనుసంధానం చేస్తాం. దీంతో రెస్క్యూ టీమ్స్, ఆఫీసర్స్, వలంటీర్ల మధ్య కోఆర్డినేషన్‌‌ ఏర్పడుతుంది. విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు సరైన యాక్షన్‌‌ తీసుకునే అవకాశం ఉంటుంది.- జయశ్రీ, డీఎం, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం

12 రోజులు ప్రత్యేక ట్రైనింగ్‌‌

ఆపద మిత్ర వలంటీర్ల కోసం 18 నుంచి 40 ఏండ్ల వయసు కలిగి, చదవడం, రాయడం వచ్చిన యువతీయువకుల నుంచి డిస్ట్రిక్ట్‌‌ ఫైర్‌‌ ఆఫీసర్లు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అనంతరం విపత్తుల సమయంలో ఎలా రెస్పాండ్‌‌ అవ్వాలో 12 రోజుల పాటు ట్రైనింగ్‌‌ ఇస్తున్నారు. ఇందులో మొదట డిజాస్టర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ రూల్స్‌‌, బేసిక్‌‌ కాన్సెప్ట్స్‌‌, పర్సనాలిటీ డెవలప్‌‌మెంట్‌‌, సైకాలజీపై క్లాసులు చెబుతున్నారు. ఆ తర్వాత రిసోర్స్‌‌ పర్సన్స్‌‌ లేదా మాస్టర్‌‌ ట్రైనర్స్‌‌తో ప్రాక్టికల్‌‌ శిక్షణ ఇప్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ స్ట్రోక్‌‌ సమయంలో బీఎల్‌‌ఎస్‌‌, సీపీఆర్‌‌, రెస్పిరేటరీ సిస్టంకు సంబంధించిన టెక్నిక్స్‌‌ నేర్పిస్తున్నారు. వరదలు, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల వంటి మేజర్‌‌ ఇష్యూస్‌‌ జరిగినప్పుడు ఏయే శాఖలు ఎలా స్పందించాలో ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్‌‌ సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నారు.

పాముకాట్లు, ఫుడ్‌‌ పాయిజనింగ్‌‌ వంటి విపత్తులు ఎదురైనా జనాలను రక్షించే విధంగా వలంటీర్లను తయారు చేస్తున్నారు. ట్రైనింగ్‌‌ అనంతరం ఆపద మిత్ర వలంటీర్ల వివరాలను ఎమర్జెన్సీ సర్వీసులకు అనుసంధానించనున్నారు. కాగా మొదటి దశలో వలంటీర్లకు ట్రైనింగ్‌‌ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేస్తుండగా, రెండో దశలో మెడికల్‌‌, ఫైర్‌‌ సేఫ్టీ సామగ్రితో కూడిన ఎమర్జెన్సీ కిట్లు సైతం అందజేయనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. ఆ తర్వాత వలంటీర్లకు ఇన్సూరెన్స్‌‌ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు.