సెప్టెంబర్ 2,3 తేదీల్లో ఓటరు నమోదుకు స్పెషల్ క్యాంపెయిన్

సెప్టెంబర్  2,3 తేదీల్లో ఓటరు నమోదుకు స్పెషల్ క్యాంపెయిన్
  • బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్

హైదరాబాద్, వెలుగు : రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్​లో భాగంగా అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 2,3 తేదీల్లో రెండ్రోజుల పాటు పోలింగ్ స్టేషన్ స్థాయిలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు  హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్  బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.  ఓటరు జాబితా తయారీలో భాగంగా 18 ఏండ్లు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటరు జాబితా పేరు లేని వారితో పాటు అక్టోబర్ 1, 2023 నాటికి 18 ఏండ్లు నిండబోయే వారు ముందస్తుగా నమోదు చేసుకోవచ్చన్నారు. 

21-08, -2023 న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ఓటరు జాబితాలో  పేరు ఉందో లేదో ముందుగా పరిశీలన చేసుకోవాలని, పేరులో ఏదైనా తప్పులు ఉంటే సవరించుకునే అవకాశం ఉందన్నారు. స్పెషల్ క్యాంపెయిన్ సందర్భంగా  బూత్ లెవెల్ అధికారి పోలింగ్ స్టేషన్​లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు.  ఓటరు జాబితాలో చెక్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ceotelangana.nic.in లో కూడా పరిశీలన చేసుకోవచ్చన్నారు. 

నూతన ఓటరు నమోదుకు ఫారం-6, ఆధార్​ను లింక్ చేయడానికి ఫారం 6బీ,  ఓటరు జాబితా అభ్యంతరాలు, ఓటరు తొలగింపునకు ఫారం-7, మార్పులు చేర్పులకు ఫారం-8 ద్వారా సెప్టెంబర్ 19లోగా  నమోదు చేసుకోవచ్చన్నారు.  ఈసీఐ వెబ్ సైట్  https://voters.eci.gov.in  లేదా voter helpline app  డౌన్​లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు.