ముంబై: నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి టీమిండియాకు కోచ్గా వ్యవహరించబోతున్నాడు. మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లే రాహుల్ కెప్టెన్సీలోని జట్టుకు లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా ఉంటాడని బీసీసీఐ సెక్రటరీ జై షా శుక్రవారం ప్రకటించారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్లేస్లో వీవీఎస్ జట్టుతో కలిసి జింబాబ్వే వెళ్తాడన్నారు.
ఈ సిరీస్ ఈనెల 18 నుంచి 22 వరకు జరుగుతుంది. ఈ నెల 27న యూఏఈలో ఆసియాకప్ మొదలవుతుంది. ఈ రెండు టోర్నీల మధ్య తక్కువ గ్యాప్ ఉండటంతో జింబాబ్వే వెళ్లే టీమ్కు వీవీఎస్ ఇంచార్జ్గా వ్యవహరిస్తాడని షా చెప్పారు. ద్రవిడ్ ఆసియాకప్ టీమ్తో కలిసి దుబాయ్ వెళ్తాడన్నారు. గత నెలలో టీమిండియా.. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్కు సన్నద్ధం అవుతుండగా.. ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని మరో టీమ్కు వీవీఎస్ కోచ్గా పని చేశాడు.