
వనపర్తి, వెలుగు: విద్యుత్ వాడకాన్ని తగ్గించుకొని దీర్ఘకాలం ఆదాయం పొందేలా సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించాలని రెడ్కో ఎండీ మనోహర్ రెడ్డిని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో రెడ్కో, విద్యుత్, లీడ్ బ్యాంక్ మేనేజర్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాలను అమలు చేస్తోందని, 5 వేల ఇండ్ల కంటే ఎక్కువ ఉన్న రెవెన్యూ గ్రామాల్లో మోడల్ సోలార్ విలేజెస్ పోటీలను నిర్వహిస్తోందని తెలిపారు.
ఎక్కువ ఇండ్లపై సోలార్ ప్యానెల్ పెట్టుకొని విద్యుత్ ఆదా చేసే గ్రామానికి కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుత్ ఉపకరణాలకు రూ. కోటి అందిస్తుందని చెప్పారు. పంచాయతీ సెక్రటరీ లు, ఎంపీడీవోలతో కలిసి గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ ఎస్ఈ రాజశేఖర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయితేజ పాల్గొన్నారు.