- సమస్యలను పరిష్కరించని మల్లారెడ్డిని ఓడిస్తం
- ఐదేళ్లుగా పట్టించుకోలేదు
- బోడుప్పల్, ఘట్కేసర్ వక్ఫ్ బోర్డు బాధితుల జేఏసీ వెల్లడి
ఖైరతాబాద్, వెలుగు : బోడుప్పల్, ఘట్ కేసర్ లోని ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరించకపోతే మేడ్చల్ సెగ్మెంట్ లో 300, గజ్వేల్ లో 200 మందితో నామినేషన్లు వేయిస్తామని వక్ఫ్ బోర్డు బాధితుల జేఏసీ ప్రకటించింది. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్ శ్రీధర్రెడ్డి, కో చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. 2016, బోడుప్పల్లో ఏబీ మధురానగర్ పేరుతో ఏర్పాటు చేసిన అప్రూవుడ్ లే ఔట్లో స్థలాలు కొని చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామన్నారు. బ్యాంకు నుంచి లోన్ తీసుకుని నిర్మాణాలు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు.
లాయర్లు, రెవెన్యూ ఎంప్లాయీస్ కూడా స్థలాలు కొనుగోలు చేసినట్లు వివరించారు. రియాజుద్దీన్ అనే వ్యక్తి ఆ భూమి వక్ఫ్ బోర్డుది అంటూ 2018లో ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ఆపేసిందన్నారు. నిబంధనల ప్రకారం అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాకే రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని బాధితులు తెలిపారు. ఈ సమస్య మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారిస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఐదేండ్లు అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు.
పసుపు బోర్డు సాధన కోసం నిజామాబాద్లో ఎలా అయితే రైతులు నామినేషన్లు వేశారో.. అలాగే, మేడ్చల్ అసెంబ్లీకి 300, గజ్వేల్ అసెంబ్లీకి 200 నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. హైకోర్టుకు కూడా వెళ్లామన్నారు. మంత్రి మల్లారెడ్డిని ఓడించడమే తమ ధ్యేయమని హెచ్చరించారు.