నల్గొండ జిల్లా కేంద్రంలో వార్​రూమ్

నల్గొండ జిల్లా కేంద్రంలో వార్​రూమ్

 నల్గొండ, వెలుగు :  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రత్యేక వార్​రూమ్​ ఏర్పాటు చేసి.. కాంగ్రెస్ బిగ్​షాట్స్ నంబర్లు, బీఆర్ఎస్​లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న లీడర్ల ఫోన్లు ట్యాప్​ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  మునుగోడు బై ఎలక్షన్స్​లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సహకరించిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రముఖ ఫైనాన్స్ సంస్థలు, రియల్టర్లు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్ల ఫోన్లు ట్యాప్​ చేసినట్టు తెలిసింది. 

ప్రభాకర్​రావు టీమ్​లో సైబర్​ క్రైమ్స్, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగిన పలువురు ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో ప్రత్యేకంగా ఓ టీమ్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇప్పుడా వ్యవహారం బయటపడటంతో అప్పుడు పనిచేసిన ఇద్దరు కానిస్టేబుళ్లను దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్నది. కొద్దిరోజుల ముందే దేవరకొండ ప్రాంతంలో సీఐ హోదా అధికారికి కూడా ఫోన్ ట్యాపింగ్​ వ్యవహారంలో నోటీసులు అందినట్టు తెలిసింది.

దీంతో ఆయన ఇప్పటికే రెండుసార్లు  దర్యాప్తు సంస్థ ఎదుట విచారణకు హాజరైనట్టు సమాచారం. ఆయనతోపాటు మరో ఇద్దరు సీఐల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇద్దరు డీఎస్పీ స్థాయి ప్రత్యేక అధికారులు మేళ్లచెర్వులో మకాం వేసి,  ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి సహకరించేందుకు.. ఆ కంపెనీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ల ఫోన్​ నంబర్లను ట్యాప్​ చేసినట్టు సమాచారం.