
- జూన్ 6న శంకుస్థాపనకు ముహూర్తం
- నలువైపులా నిర్మాణానికి సర్కార్ రూ. 24 కోట్లు మంజూరు
- రూ.30 కోట్లతో తిరుపతి తరహా మాడవీధుల పనులు
- చివరి దశలో ఆలయ చెరువులో పూడికతీత
- ఐలాండ్స్, కేబుల్ బ్రిడ్జి ఏర్పాటుకూ ప్లాన్
వరంగల్, వెలుగు : ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి మరో అడుగు పడుతోంది. ఇప్పటికే ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణ పనులు నడుస్తున్నాయి. రాజగోపురాల ఏర్పాటుకు ముహూర్తం కూడా ఖరారైంది. రూ.24కోట్లతో ఆలయానికి నాలుగు వైపులా గోపురాల నిర్మాణ పనులకు జూన్ 6న శంకుస్థాపన ఏర్పాట్లు చేస్తున్నారు.
కాకతీయుల కాలంలో 800 ఏండ్ల కింద నిర్మించిన భద్రకాళి అమ్మవారి ఆలయం వందల ఏండ్ల పాటు భక్తుల సందర్శనతో విరాజిల్లింది. కాకతీయుల రాజ్యం ప్రాభవం కోల్పోయిన తర్వాత దాదాపు 625 ఏండ్లు ఆదరణ కోల్పోయింది. 1948లో బీఎస్ గణేశ్ శాస్త్రీ దాతల సాయంతో ఆలయాన్ని పునరుద్ధరించారు.
1986లో దక్షిణ భారత్ లోని ఆలయాల సంప్రదాయాల ప్రకారం ఆలయ శిఖరం, మహా మండపం, సాలహారాలను నిర్మించారు. మరోసారి ప్రస్తుత ప్రభుత్వం ఆలయం పునరుద్ధరణ పనులను చేపట్టింది. ఆలయ అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
తిరుపతి మాడ విధుల తరహాలో పనులు
భద్రకాళి అమ్మవారికి ఏటా 10 రోజులు నిర్వహించే శాకాంబరి ఉత్సవాల్లో రథ ఊరేగింపు చేయాల్సి ఉండగా సరైన దారి లేకపోవడంతో గుడి లోపలనే పూర్తి చేస్తున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం తరహాలోనే భద్రకాళి ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణం చేపట్టేందుకు రూ.54 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 30 అడుగుల వెడల్పుతో పనులు చేపట్టగా.. ఆలయానికి మూడువైపులా చెరువు, కొండ, లోయ ఉండటంతో బిగ్ టాస్క్ గా మారింది. లోయను మట్టితో పూడ్చారు. కొండను తొలిచారు. చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి అందులోని నీటిని ఖాళీ చేసి పనులు చేపట్టారు.
మదురై టెంపుల్ లెక్కనే..
భద్రకాళి ఆలయ రాజగోపురాలు వైభవంగా ఉండేందుకు ప్రకృతి విపత్తులు తట్టుకుని ఉండాలని అధికారులు భావించారు. అలాంటి కట్టడాలు నిర్మించిన మధురై మీనాక్షి, కంచి కామాక్షి, మహాబలిపురం తదితర ఆలయ గోపురాల నిర్మాణాలను దేవాదాయ శాఖ ఇంజినీర్లు పరిశీలించి వచ్చారు. సీఎం రేవంత్రెడ్డి సూచనలతో మధురై మీనాక్షి ఆలయ రాజగోపురాల తరహాలో భద్రకాళి నిర్మాణాలు ఉండేలా ఫైనల్ చేశారు.
మధురై, తంజావూరుకు చెందిన స్తపతులతో ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. రూ.24 కోట్లతో ఆలయానికి నాలుగు వైపులా ఒకే మాదిరిగా రాజగోపురాలు నిర్మించనున్నారు. ఎప్పటినుం చో ఆలయానికి అనుబంధంగా ఉన్న హనుమకొండ కాపువాడ వైపు లోయలో వేద పాఠశాల ఉంది. మాడవీధుల నిర్మాణంతో దీన్ని తొలగించాల్సి వస్తుంది. కొన్ని రోజులుగా పాత సెంట్రల్ జైలు ఎదురుగా దేవాదాయ శాఖ ఆఫీసులో నడిపిస్తున్నారు. ప్రస్తుతం కొత్త వేద పాఠశాల నిర్మాణ పనులు కూడా ప్రారంభించనున్నారు.
చెరువు మధ్యలో ఐలాండ్స్.. బోటు షికారు
భద్రకాళి ఆలయ అభివృద్ధితో పాటు చెరువును సైతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆలయ మాడవీధుల కోసం బ్రిడ్జి వేసే క్రమంలో చెరువులోని నీటిని కూడా ఖాళీ చేశారు. పూడికతీత పనులు కొనసాగుతుండగా చివరి దశకు చేరాయి. చెరువు మధ్యలో మెయిన్ ఐలాండ్తో పాటు మరో ఎనిమిదిచోట్ల మినీ ఐలాండ్స్ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నారు.
చెరువు కట్టను భద్రకాళి బండ్ వరకు పొడిగించి బ్యూటిఫికేషన్ పెంచడం ద్వారా టూరిజం స్పాట్ గా రూపొందించనున్నారు. చెరువులో బోటు షికారు.. పైభాగం నుంచి పద్మాక్షి ఆలయ గుట్టకు కేబుల్ బ్రిడ్జి ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. ఆలయ రాజ గోపురాల శంకుస్థాపన సందర్భంగా భద్రకాళి చెరువు అభివృద్ధిపైనా మంత్రులు ప్రకటన చేయనున్నారు.