
- వాహనాల పేరిట రూ.42 కోట్లు ఖర్చు చేసినా ఉట్టిదే..
- రూ.వందలతో రిపేరయ్యే పనులనూ పట్టించుకోవట్లే
- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు
- కమీషన్ల కోసం కిరాయి వాహనాలు తెప్పిస్తున్నారనే ఆరోపణలు
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కోట్లు ఖర్చుచేసి కొనుగోలు చేసిన ఇంటింటా చెత్త సేకరించే ఆటోలు, వాహనాలు చిన్నపాటి రిపేర్లు చేయకపోవడంతో మూలకుపడ్తున్నాయి. తక్కువ ఖర్చుతో రిపేరు చేసి రోడ్లమీదకు తీసుకురావాల్సిన బల్దియా ఆఫీసర్లు వాటిని పట్టించుకోకుండా కిరాయి వాహనాలు తెప్పించి నడిపించడం ద్వారా కమీషన్ల దందా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్వీపింగ్, స్వచ్ఛ వాహనాలు రిపేర్లకు నోచుకోక చాలా నెలలుగా మూలకు ఉంచడంతో తుప్పు పడ్తున్నాయి.
రూ.42 కోట్లు ఖర్చు చేసిన్రు..
గ్రేటర్ వరంగల్ సిటీలో ఏటేటా ఇండ్లు, కాలనీలు పెరుగుతున్నాయి. జనాభా సైతం దాదాపు 11 లక్షలకు చేరింది. ఈ క్రమంలో 66 డివిజన్లలో ఇంటింటా చెత్త సేకరణ కోసం గ్రేటర్ ఆఫీసర్లు రూ.42 కోట్లు ఖర్చు చేసి 313 స్వచ్ఛ ఆటోలతో, 162 ఓనర్ కమ్ డ్రైవర్ విధానం వాహనాలను తీసుకున్నారు. ఇవేగాక 150 కొత్త వాహనాలు, మరో 50 ఆటోలు పట్టణ ప్రగతిలో కొనుగోలు చేశారు. టైర్లు అరగడం, క్లచ్ ప్లేట్లు దెబ్బతినడం, ఇంజిన్ ఆయిల్, బ్యాటరీ మార్పు, గేర్ వైర్లు సరిగాలేకపోవడం, బ్రేక్ లైనర్లు అరగడం, సెల్ఫ్ మోటర్లు పనిచేయకపోవడం వంటి చిన్నపాటి సమస్యలను కూడా పట్టించుకోలేదు. దీంతో దాదాపు 40కి పైగా వాహనాలు 6 నెలల నుంచి 2 ఏండ్లుగా బాలసముద్రంలోని డంపింగ్ యార్డ్, మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర్లో మూలకు పెట్టారు. సిటీరోడ్లు శుభ్రం చేసేందుకు స్వీపింగ్ వెహికల్స్ తెప్పించిన అధికారులు రిపేర్ల పేరుతో ఏనాడు వాటిని పూర్తిస్థాయిలో వాడలేదు.
కమీషన్ల కోసం కిరాయి వాహనాలు..
గ్రేటర్ పరిధిలో చెత్త సేకరణ, రోడ్ల శుభ్రం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వాహనాలు తెప్పించగా, కొందరు అధికారులు మాత్రం ప్రైవేట్ వాహనాలతో కిరాయి దందా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సొంత వాహనాలను రిపేర్ల పేర పక్కనపెట్టి, ఎమర్జెన్సీ సర్వీస్ పేరుతో కిరాయి వాహనాలను తెప్పిస్తున్నారు. నెలల తరబడి వాటికి లక్షల్లో కిరాయి చెల్లించి కమీషన్లు తీసుకుంటున్నట్లు విమర్శ ఉంది. ఇటీవల గ్రేటర్ వరంగల్ 13వ డివిజన్లో నిత్యం చెత్త తరలించే ఓ ట్రాక్టర్కు చిన్న రిపేర్ వచ్చింది.
దీనికి రూ.2,500 ఖర్చుచేసి ఓ గంట సమయం కేటాయిస్తే రిపేర్ అవుతుంది. అధికారులు ఆ పని చేయించకుండా 16 రోజులు ప్రైవేట్ ట్రాక్టర్ కిరాయికి తీసుకుని రూ.35 వేలు కట్టారు. అయినా చెత్త సేకరణకు ఆ ట్రాక్టర్ రాలేదు. ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ సునీల్ జోషి అధికారులకు చెబితే స్పందన రాలేదు. దీంతో అతడు మున్సిపాలిటీకి చెందిన ట్రాక్టర్ను ఆటోనగర్ తీసుకెళ్లి కేవలం రూ.2,200తో అరగంటలో రిపేర్ చేయించి, అధికారుల కిరాయి దందాను బయటపెట్టాడు.