- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నెల 11న జనగామ, స్టేషన్ ఘన్ పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమిషనరేట్ పోలీస్ ఆఫీసర్లతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మద్యాన్ని కట్టడి చేయడంతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అభ్యర్థులు అందించే తాయిలాలపై నిఘా పెట్టాలన్నారు.
ఎక్కడైనా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తే, వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. బ్యాలెట్ పత్రాల పంపిణీ, ఎన్నికలు, కౌంటింగ్ రోజున బందోబస్తు పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఉన్నతాధికారులు ఎన్నికల సరళిని పర్యవేక్షించాలని, ప్రతి ఒక్కరూ ఎలక్షన్ రూల్స్ పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, కవిత, ఏఎస్పీలు శుభం, చేతన్, టైనీ ఐపీఎస్ మనీషా నెహ్ర పాల్గొన్నారు.
