
నిబంధనలు పట్టించుకోకుండా నిర్మాణ వ్యర్థాలు, బండరాళ్లు తరలిస్తే చర్యలు
హైదరాబాద్, వెలుగు: భద్రత లేకుండా నిర్మాణ వ్యర్థాలు, బండరాళ్లను తరలించే వాహనదారులపై ఇక నుంచి రాష్ట్ర సర్కారు కఠినంగా వ్యవహరించనుంది. రూల్స్ పాటించాలని విజ్ఞప్తులు చేస్తున్నా కాంట్రాక్టర్లు, నిర్మాణ వ్యర్థాలు తరలించే ఏజెన్సీలు పట్టించుకోకపోవడంతో ఇప్పటి వరకు విధిస్తున్న జరిమానాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవల రవాణా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇష్టమున్నట్లు పోతున్నయి
రాష్ట్రంలో నిర్మాణ రంగం దూసుకుపోతుండటంతో బండరాళ్లు, ఇతర నిర్మాణ వ్యర్థాలను ప్రమాదకరంగా తరలిస్తున్నారు. ఈ సమయంలో లారీలు, ట్రక్కుల నుంచి బండరాళ్లు, నిర్మాణ వ్యర్థాలు కింద పడుతున్నాయి. స్పీడ్ బ్రేకర్లు, మూలమలుపులు, ఎత్తుగా ఉండే ప్రాంతాల నుంచి నిర్మాణ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాలకు సరైన భద్రత కల్పించడం లేదు. దీంతో అక్కడక్కడా లారీలు, ట్రక్కుల నుంచి బండరాళ్లు, నిర్మాణ వ్యర్థాలు రోడ్డుపై పడుతున్నాయి. దీంతో అనేక మంది వాహనదారులు ప్రమాదానికి గురై మృత్యువాతపడుతున్నారు.నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు, నిర్మాణ వ్యర్థాలను తరలించే ఏజెన్సీలకు భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సర్కార్ సూచించినా పట్టించుకోవడంలేదు. అర్ధరాత్రి వేళల్లో బండరాళ్లు, మట్టి చేరవేసేందుకు ఉపయోగిస్తున్న టిప్పర్లు అతివేగంగా తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
భారీగా జరిమానాల పెంపు
ఇష్టారాజ్యంగా నిర్మాణ వ్యర్థాలు, బండరాళ్లు తరలిస్తుండటంతో ప్రస్తుతమున్న జరిమానాలను భారీగా పెంచడంతో ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. లోడ్ ఎక్కువైనా.. రూల్స్ పాటించకపోయినా మొదటిసారి దొరికితే రూ.25 వేలు. రెండోసారి రూ.50 వేలు. మూడోసారి దొరికితే లక్ష ఫైన్తోపాటు వాహనాన్ని సీజ్ చేయనున్నారు. ప్రమాదకర, అనుమతి లేని ప్రాంతంలో నిర్మాణ వ్యర్థాలను డంపింగ్ చేస్తే రూ.50 వేల చొప్పున జరిమానా విధించనున్నారు. జరిమానాలతో పాటు నివారణ చర్యలను హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.