టాయిలెట్లు సరే… నీళ్ల మాటేమిటి?

టాయిలెట్లు సరే…  నీళ్ల మాటేమిటి?

పల్లెలు ఎంత పరిశుభ్రంగా ఉంటే ప్రజలు అంత ఆరోగ్యంగా ఉంటారు. గ్రామాలు నీట్​గా ఉండాలంటే ఓపెన్​ డిఫకేషన్ లేకుండా చేయటమే మార్గం. ప్రతి ఇంట్లో టాయిలెట్​, బాత్​రూమ్​ కట్టించినంతమాత్రాన సాధ్యపడదు. వాటికి పైపుల ద్వారా నీళ్ల సరఫరా ఉండాలి. డ్రైనేజీలను కూడా పక్కాగా నిర్మించాలి. ఇంటింటికీ నల్లా ద్వారా అవసరమైనన్ని నీళ్లు అందించాలి. ‘స్వచ్ఛ భారత్​ మిషన్’ వంద శాతం సక్సెస్​ కోసం కేంద్రం మిషన్​ పానీ కార్యక్రమం ప్రారంభించింది.

ఓ 30–35 ఏళ్ల క్రితం బాలచందర్​ ‘తన్నీర్​ తన్నీర్’ సినిమా తీశారు. గ్రామాల్లో నీటి ఎద్దడిపై తీసింది. ఒక  స్కూలులో మాస్టారు రోజూ స్నానం, ఒంటి శుభ్రతపై పాఠం చెబుతుంటాడు. ఒక పిల్లాడు లేచి, ‘తాగడానికే నీళ్లు లేవు కదా సార్​! రోజూ స్నానం వీలవుద్దా?’ అంటాడు. ఇన్నేళ్లలో కేంద్రంలో కనీసం తొమ్మిది ప్రభుత్వాలు మారిపోయాయి. ల్యాండ్​ లైన్​ ఫోన్​ కోసం ఏళ్ల తరబడి వెయిటింగ్​ లిస్టులో ఉండే జనాలకు ఇప్పుడు చిటికెలో మొబైల్​ కనెక్షన్​ దొరుకుతోంది. ఇల్లు కదలకుండా బిల్స్​ కట్టడం, రైలు టిక్కెట్లు బుక్​ చేయడం, బ్యాంక్​ మొహం చూడకుండా లావాదేవీలు జరపడం వగైరా డెవలప్​మెంట్​ చాలా సాధించింది ఇండియా. కానీ, తన్నీర్​ తన్నీర్​ రోజులనాటి నీటి ఎద్దడి, ఒంటి శుభ్రత, ఓపెన్​ మరుగుదొడ్ల సమస్య మాత్రం చాలా గ్రామాల్లో అలాగే ఉంది.

ఇక, దేశవ్యాప్తంగా పల్లెల్లోని 93 శాతం ఇళ్లలో టాయిలెట్ సదుపాయాలు ఉన్నాయని, వాటిని 96 శాతం మంది ఉపయోగిస్తున్నారని ఇటీవల సర్కారు​ పరిశీలనలో తేలింది. 2018–19లో జరిగిన ‘నేషనల్​ యాన్యువల్​ రూరల్​ శానిటేషన్​ సర్వే’ ఈ విషయాన్ని తెలిపింది. గ్రామాల్లో ‘స్వచ్ఛ భారత్​ మిషన్’ కవరేజీని, టాయిలెట్ల వాడకాన్ని పలు స్టడీలు, ఫీల్డ్​ రిపోర్టులు విశ్లేషణ చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన మైక్రో లెవల్​ అసెస్​మెంట్లకు, ఈ సర్వేలోని అంశాలకు మధ్య కొంత తేడా వచ్చింది.

‘అలా ఎందుకు జరిగింది?’ అనే ప్రశ్న తలెత్తింది. దీనికితోడు​  పరిశుభ్రతపై ప్రజల, పాలకుల​ ఆలోచనలపై ఏకాభిప్రాయం లేదు. ‘స్వచ్ఛ భారత్​ మిషన్​’ 100 శాతం సక్సెసయి ఉంటే… శానిటేషన్​ సంబంధ రోగాలు రాకూడదు.  పరిశుభ్రత లేకపోవడంతో జనం ఇప్పటికీ క్వాలిటీ లైఫ్​ను పొందలేకపోతున్నారని సర్వే గుర్తు చేసింది. దీనిపై సెంట్రల్​ డ్రింకింగ్​ వాటర్​ అండ్​ శానిటేషన్​ మినిస్ట్రీ కొన్ని గైడ్​లైన్స్ విడుదల చేసింది. అన్ని ఊళ్లనూ ‘బహిరంగ మల విసర్జన లేని’ (ఓపెన్​ డిఫకేషన్​ ఫ్రీ–ఓడీఎఫ్​) ప్రాంతాలుగా మార్చటానికి ఉపయోగపడే సలహాలు ఇచ్చింది. స్వచ్ఛ భారత్​ మిషన్​ని ప్రెస్టేజీగా భావిస్తున్న మోడీ రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టడంతో ఈ మిషన్​ని మరింత పక్కాగా అమలుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విలేజ్​ లెవెల్లో అమలు చేయటంలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయి.

సేఫ్​ శానిటేషన్​పై ప్రచారం

ఒడిశాలోని రూరల్​ ఏరియాల్లో 1994 నుంచి 2019 వరకు అమలుచేస్తున్న ‘గ్రామ్​ వికాస్​’ కార్యక్రమంలో ఎదురైన అనుభవాలను బట్టి ఆ ఇబ్బందులను వివరించొచ్చు. సేఫ్​ శానిటేషన్​పై ప్రచారం చేశారు. జనం నెమ్మదిగా దానికి అలవాటు పడుతున్నా… టాయిలెట్లు ఉపయోగించాలంటే సమృద్ధిగా నీళ్లు అవసరమన్న విషయాన్ని మొదట్లో గుర్తించలేదు. ‘గ్రామ్​ వికాస్’​లో భాగంగా పల్లెల్లోని వంద శాతం ఇళ్లలో ఇంటిగ్రేటెడ్​ వాటర్​, శానిటేషన్​, హైజీన్ ​(డబ్ల్యూఎస్​హెచ్​)లో మార్పు తేవాలని టార్గెట్​ పెట్టుకున్నారు.

టాయిలెట్లు, బాత్​రూమ్​లు కట్టించి, వాటికి పైపుల ద్వారా నీళ్లు సప్లై చేయాలని భావించారు. మన దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది బెస్ట్​ ప్రాక్టీస్​గా గుర్తింపు పొందింది. పాతికేళ్ల క్రితం మొదలెట్టిన గ్రామ్​ వికాస్ ప్రోగ్రాంని ఈ ఏడాది మార్చి 31 నాటికి 1,400లకు పైగా గ్రామాల్లోని దాదాపు 90 వేల ఇళ్లలో అమలు చేశారు. శానిటేషన్, డ్రింకింగ్​ వాటర్ సదుపాయాలకు ఆర్థిక సాయాన్ని బేసిక్​గా ప్రభుత్వ పథకాల ద్వారా అందించారు.

‘టోటల్​’ మార్పు కోసం..

గవర్నమెంట్​ కొత్తగా ‘టోటల్​ శానిటేషన్​ క్యాంపెయిన్​’ను ప్రారంభించింది. 1999–2007 మధ్య కాలంలో ప్రజలకు శానిటేషన్​ సదుపాయాల నిర్మాణంలో ఆర్థికంగా తోడ్పాటు లభించింది. బీపీఎల్​ కుటుంబాలకు ఇంటికి రూ.300 చొప్పున ఇచ్చారు. కమ్యూనిటీల ఆధ్వర్యంలోని పైప్డ్​ వాటర్​ సప్లై ప్రాజెక్టులకు ఫైనాన్షియల్​ సపోర్ట్​ కొంచెం ఆలస్యంగా దొరికింది. 2003లో ‘స్వజల్​ధార’ పథకాన్ని ప్రారంభించటంతో గ్రామాల్లో శానిటేషన్​ పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే, ఆ సదుపాయాలు చాలా వరకు డ్యామేజ్​ అయ్యాయి. అందువల్ల వాటి రిపేర్, అప్​గ్రెడేషన్​ కోసం ఫైనాన్షియల్​ సపోర్ట్​ కొనసాగించాల్సిందే.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి