హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి పీకే వ్యూహకర్తగా వ్యవహరించనున్నారని, త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పీసీసీ మాజీ ప్రెసిడెంట్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. పీకే విషయం తనకు తెలియదని, ఇదంతా మీడియాలో రావడమే తప్ప తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయనుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేసిందే కాక... పైకి దొంగ దీక్షలు చేశాయని మండిపడ్డారు. దేశంలో పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన ఆయన... ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ధాన్యం సేకరణలో కేసీఆర్ నిర్లక్ష్యానికి రైతులు బలవుతున్నారని, వారి నుంచి తక్కువ ధరకు మిల్లర్లు కొంటున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.2 వేల కోట్ల పంట బీమా సొమ్మును కేసీఆర్ పక్కదారి పట్టించారని ఆరోపించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఉచిత ఎరువులు, రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పడేసిందని దుయ్యబట్టారు. రైతుల సమస్యల గురించి వచ్చే నెల 6న వరంగల్ లో రైతు సంఘర్షణ సభను నిర్వహించనున్నట్లు తెలిపిన ఆయన... ఆ సభకు రాహుల్ గాంధీ రానున్నారని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఉత్తమ్ ధీమా వ్యక్యం చేశారు.
మరిన్ని వార్తల కోసం..