- మెజారిటీ ఉద్యోగుల మాట ఇదే
- రాజీనామాలు పెరిగే చాన్స్
- వెల్లడించిన స్టడీ రిపోర్ట్
ముంబై: ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రావాలని కంపెనీలు ప్రోత్సహిస్తున్నప్పటికీ.. చాలా మంది తమకు ఇష్టం లేదని చెబుతున్నారని తాజా స్టడీ ఒకటి వెల్లడించింది. తిరిగి ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ విధానానికి మారడం తమకు కష్టమని భావిస్తున్నారు. వర్క్- ఫ్రమ్ -ఆఫీస్ మాడ్యూల్పై మెజారిటీ ఉద్యోగులు భయంతో ఉన్నారు. ఈ విధానానికి హఠాత్తుగా మారడం సాధ్యం కాదని సర్వేలో పాల్గొన్న వారిలో 69 శాతం మంది స్పష్టం చేశారని స్టాఫింగ్ సొల్యూషన్స్ హెచ్ఆర్ సర్వీస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ రిపోర్ట్ తెలిపింది.
కేవలం 25 శాతం మంది మాత్రమే వర్క్ ఫ్రం హోం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. బ్యాంకింగ్ ఫైనాన్స్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్ఆర్ సొల్యూషన్స్, ఐటీ, ఐటీఈఎస్, తయారీ వంటి రంగాలలో పనిచేసే 1,213 మందిని అక్టోబర్ 26 నుంచి నవంబర్ 30 వరకు ప్రశ్నించడం ద్వారా ఈ రిపోర్ట్ తయారు చేశామని జీనియస్ తెలిపింది. ఆఫీసుకు రమ్మని ఆదేశించడం వల్ల రాజీనామాలు పెరిగే అవకాశం ఉందని రిపోర్ట్ అంచనా వేసింది. 82 శాతం మంది ఉద్యోగులు మార్కెట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
దీనివల్ల తాము ఆందోళన పడుతున్నారని చెప్పారు. 12 శాతం మంది రాజీనామాలను ప్రధాన సమస్యగా భావించలేదు. దాదాపు 67 శాతం మంది వర్క్ -ఫ్రమ్ -ఆఫీస్ వల్ల కొత్త ఉద్యోగులను మిగతా వారితో కలిసిపోవడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కంపెనీలు ఫ్లెక్సిబిలిటీకి అవకాశం ఇవ్వాలని చాలా మంది ఉద్యోగులు అన్నారు. ఇంటితోపాటు ఆఫీసు నుంచీ పనిచేయడానికి అనుమతించాలని కోరారు.
ముఖ్యంగా ఆఫీసు నుంచి ఇల్లు దూరం ఉన్న వారికి మినహాయింపులు ఉండాలని 56 శాతం మంది అన్నారు. దీనికి విరుద్ధంగా, 33 శాతం మంది మాత్రం మినహాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడారు. ‘‘వర్క్ ఫ్రం హోం గురించి ఉద్యోగుల్లో ఒకేరకమైన అభిప్రాయం లేదు. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంది. కొత్త విధానానికి మారడానికి మేం రెడీగా ఉన్నామని కొందరు చెప్పారు. కంపెనీలు ఫ్లెక్సిబిలిటీకి అవకాశం ఇస్తేనే బాగుంటుంది”అని జీనియస్కన్సల్టెంట్స్సీఎండీ ఆర్పీ యాదవ్ అన్నారు.