- ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
గద్వాల, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు రూ. 5 వేల కోట్లు ఇచ్చామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ప్రతి కార్యకర్త తానే ఎంపీ క్యాండిడేట్గా భావించి కష్టపడి పనిచేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో రోడ్షో నిర్వహించారు.
అనంతరం గద్వాల పట్టణంలోని వైఎస్ఆర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వాటిని తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆగస్టు 15 తర్వాత రైతు రుణమాఫీ చేస్తామని, ముదిరాజ్లను బీసీ ‘డి’ నుంచి ‘ఏ’ లోకి మారుస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ క్యాండిడేట్ మల్లు రవి, జడ్పీ చైర్పర్సన్, గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరిత, తిరుపతయ్య, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్కుమార్ పాల్గొన్నారు.
పోలీస్ పహారాలో మంత్రి మీటింగ్
ధరూర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి పోలీస్ పహారా మధ్య మంత్రి మీటింగ్ జరిగింది. ధరూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ బండ్ల చంద్రశేఖర్ రెడ్డిపై దాడి చేయడంతో, మంత్రి మీటింగ్ను అడ్డుకుంటారని భావించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో గద్వాల సీఐ భీంకుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్సైలు, పెద్ద సం ఖ్యలో పోలీసులు చేరుకొని బందోబస్తు నిర్వహించారు.
కాంగ్రెస్లో విభేదాలు
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్ రెడ్డిపై జడ్పీ చైర్పర్సన్ సరిత వర్గీయుడు రామకృష్ణ దాడి చేయడం కలకలం రేపింది. మల్దకల్ మండల కేంద్రంలో బుధవారం ప్రచార రథం ఎక్కేందుకు బండ్ల రాజశేఖర్ రెడ్డి ప్రయత్నం చేయగా, పెద్ద రామకృష్ణ అడ్డుకోవడంతో కుమ్ములాటకు దారితీసింది. పార్టీ క్యాండిడేట్ మల్లు రవి తమ ఇండ్లకు వచ్చి ప్రచారానికి రావాలని పిలిచి దాడి చేశారని బండ్ల రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.