
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎన్నికలో ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. ఈ క్రమంలో రాంచందర్ రావును ఈ నియోజకవర్గ ఎన్రోల్మెంట్ కోఆర్డినేటర్గా రాష్ట్ర బీజేపీ నియమించింది. శనివారం హైదరాబాద్ బర్కత్పురలోని సిటీ బీజేపీ ఆఫీసులో ఈ నియోజకవర్గ పరిధిలోని రాంచందర్ రావు అధ్యక్షతన పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్రోల్మెంట్ విషయంలో పార్టీ క్యాడర్ ఏ మాత్రం అశ్రద్ధ చూపవద్దని, కొత్త గ్రాడ్యుయేట్లను పెద్ద సంఖ్యలో చేర్పించాలని పార్టీ నాయకులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. కాగా, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయింది. ఈ మీటింగ్కు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.