- ఆయన భాష కూడా సరిగ్గా లేదు.. నా ప్రశ్నలకు జవాబులివ్వలేదు: రాహుల్గాంధీ
- కేంద్రం కావాలని తప్పించుకుంటున్నదని ఫైర్
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రెజర్లో ఉన్నారని, లోక్సభలో తాను వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేక ఆందోళనకు గురయ్యారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అమిత్ షా భాష కూడా సరిగ్గా లేదని, అబద్ధాలు వల్లెవేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం లోక్సభలో రాహుల్ గాంధీ, అమిత్ షా మధ్య మాటల యుద్ధం నడిచింది.
దీనిపై గురువారం పార్లమెంట్ ఆవరణలో మీడియా ప్రతినిధులు రాహుల్ను ప్రశ్నించగా.. ‘‘బుధవారం లోక్సభలో నా ప్రశ్నలకు సమాధానం చెప్పే టైమ్లో అమిత్ షా జీ చాలా ఆందోళనగా కనిపించారు. ఆయన చేతులు కూడా వణికిపోయాయి. ఏదో మానసిక ఒత్తిడిలో కూరుకుపోయినట్టు కనిపించారు. అమిత్ షా మాట తీరు కూడా కరెక్ట్గా లేదు. తప్పుడు భాషను ఉపయోగించారు. ఇదంతా యావత్ దేశం చూసింది.
ఓటు చోరీకి సంబంధించి మీడియా ముందు నేను విడుదల చేసిన ఆధారాలపై లోక్సభలో చర్చకు సిద్ధమని నేరుగా సవాల్ విసిరితే.. ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ఓట్ చోరీపై చర్చకు మేం రెడీ. కేంద్ర ప్రభుత్వం కావాలని తప్పించుకుంటున్నది” అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ రంగ సంస్థలపై కేంద్రం కుట్ర
ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్యూ)లను దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని.. వాటిని అనుచరులకు, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నదని రాహుల్గాంధీ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారత్ ఇమ్యునోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఐబీసీవోఎల్) సంస్థ ఉద్యోగుల సమస్యలపై ఆయన స్పందించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఐబీసీవోఎల్ను కేంద్ర ప్రభుత్వం కావాలనే పక్కనబెడ్తున్నదని, అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కొన్నాళ్లుగా శాలరీలు కూడా ఇవ్వడం లేదన్నారు.

