150 షోరూమ్‌‌లను తెరుస్తాం.. ఓబెన్ ఎలక్ట్రిక్ ప్రకటన

150 షోరూమ్‌‌లను తెరుస్తాం.. ఓబెన్ ఎలక్ట్రిక్ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: దేశీయ ఎలక్ట్రిక్ మోటార్‌‌సైకిల్ తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా 150 షోరూమ్‌‌లను, సర్వీస్ సెంటర్‌‌లను ప్రారంభిస్తామని ప్రకటించింది.  ఆంధ్రప్రదేశ్​ విశాఖపట్నంలో తమ 50వ షోరూమ్, సర్వీస్ సెంటర్‌‌ను మొదలుపెట్టిన సందర్భంగా కంపెనీ సీనియర్​ఎగ్జిక్యూటివ్స్​ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఓబెన్ ఎలక్ట్రిక్ ఇటీవల గుంటూరు (ఆంధ్రప్రదేశ్), రాంచీ (జార్ఖండ్), జబల్‌‌పూర్ (మధ్యప్రదేశ్), అలీగఢ్​, ఉన్నావ్ (ఉత్తర ప్రదేశ్), పాలక్కాడ్ (కేరళ) వంటి నగరాల్లో ఔట్​లెట్స్​ను తెరిచింది.  దేశంలోని 15 రాష్ట్రాల్లోని 37 నగరాల్లో కంపెనీ  కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తమ ఎలక్ట్రిక్​బైక్​ రోర్ ఈజెడ్ మార్కెట్లో మంచి విజయం సాధించిందని, ఇటీవలే రోర్ ఈజెడ్ సిగ్మా మోడల్​ను తెచ్చామని కంపెనీ సీఈఓ మధుమిత అగర్వాల్ చెప్పారు.  

అందరికీ ఈవీలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు.  గణేష్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 15 వరకు తమ ఈవీలను కొనేవారికి బంగారు నాణెం బహుమతిగా ఇస్తామని తెలిపారు.